కేసీఆర్ టార్గెట్ ఎఫెక్ట్: ఇన్నాళ్లకు.. కోదండరాంను అంతమాట అనేశారు!
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెరాస నేతలు కోదండ పైన చేస్తున్న చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెరాస నేతలు కోదండ పైన చేస్తున్న చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వారు కోదండ గతాన్ని నిలదీయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
కోదండరాంపై బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్, సోనియా గాంధీతో సీక్రెట్గా..!
నిజంగానే అప్పుడు కోదండరాం నుంచి తప్పు ఉంటే కలిసి ఎందుకు పని చేశారనే చర్చ సాగుతోంది. గత కొద్దికాలంగా కోదండ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు ఆయన పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రైతుల నుంచి ప్రాజెక్టుల కోసం బలవంతంగా భూములు లాక్కోవద్దని ఆయన అంతకుముందు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటీవల జోనల్ వ్యవస్థ రద్దు చేస్తామనే ప్రభుత్వ అభిప్రాయాన్ని తప్పుబట్టారు. నిజాం షుగర్స్ పైన అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రశ్నించారు. కేబినెట్లో మహిళలకు ప్రాతినిథ్యం ఉండాలన్నారు. ఇలా పలు అంశాలను ఆయన లేవనెత్తారు.
కోదండ వర్సెస్ తెరాస
ఆయన నిలదీయడంపై అధికార పార్టీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గతంలోనే మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కలిసి కోదండరాం పైన నిప్పులు చెరిగారు. అయితే, ఉద్యమంలో లేని వారు, ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని, అలాంటివారు కోదండ పైన విమర్శలు చేస్తున్నారనే రివర్స్ కౌంటర్ వచ్చింది.
కోదండపై సుమన్ ఆగ్రహం
అయితే, కోదండ పైన ఎక్కువగా ఎంపీ బాల్క సుమన్ స్పందిస్తుంటారు. ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే, ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తే.. ఉద్యమం సమయంలో కోదండ కుట్ర చేశారని తెరాస నేతలు చెప్పడాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహిగా ముద్రవేయడం అలవాటు అయిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉద్యమంలో కలిసి..
దాదాపు 2010 నుంచి తెలంగాణ సిద్దించే వరకు కొన్ని అరమరికలు ఉన్నప్పటికీ కోదండ నేతృత్వంలోని జేఏసీ, తెరాస కలిసి ఉద్యమించాయి. అయితే, ఇప్పుడు కోదండ పైన తెరాస నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండటం గమనార్హం.
ఉద్యమం సమయంలో..
కోదండరాం కుట్ర చేశారని, ఎన్నికల సమయంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లు ఇప్పించుకున్నారని, తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఆయనకు మొదటి నుంచి కాంగ్రెస్ వాసన ఉందన్నారు. ఇంకా.. అసలు తెలంగాణ కోసం కోదండ ఏం చేయలేదని బాల్క సుమన్ సోమవారం అన్నారు. వీటినే తప్పుపడుతున్నారు.
ఈ విమర్శలపై..
అయితే, తెలంగాణలో జీవం లేని కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తున్నారని, సోనియా గాంధీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా పని చేస్తున్నారని, పార్టీ ఫిరాయింపుల పైన ఆయన మాట్లాడటం ఏమిటని, ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తాజా విమర్శలపై స్పందిస్తున్నారు. ఇలాంటి వాటిలో తప్పులేదని, కానీ ఉద్యమ సమయాన్ని ఇప్పుడు తీసుకు రావడం మాత్రం సరికాదంటున్నారు.
ఆంధ్రా తొత్తులు
ఉద్యమం సమయంలో తెలంగాణ కాంగ్రెస్, టిడిపి సభ్యులు ఉద్యమించినా.. ఆంధ్రా తొత్తులుగా అభివర్ణించారని, అప్పుడు అర్థం చేసుకోవచ్చునని, ఇప్పుడు కోదండను కూడా ఉద్యమం విషయంలో నిలదీయడాన్ని చూస్తుంటే.. విమర్శిస్తే తెలంగాణ ద్రోహులుగా ముద్రవేయడం అలవాటుగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యమం సమయం గురించి కోదండ ఏమీ మాట్లాడటం లేదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని గుర్తు చేస్తున్నారు.