మునుగోడు ఓటర్లకు బంధువులతో గాలం.. టీఆర్ఎస్ మాయాజాలం; షాకింగ్ రాజకీయం!!
మునుగోడు ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.. బాబ్బాబు అంటూ రాజకీయ నాయకులందరూ మునుగోడు ఓటర్ల చుట్టూనే తిరుగుతున్నారు. మునుగోడు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు, ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. భవిష్యత్ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక కీలకం కావటంతో అందరి ఫోకస్ దీనిపైనే ఉంది.
ప్రతీ ఓటు కీలకంగా భావిస్తున్న రాజకీయ పార్టీలు
మునుగోడు ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ ప్రతి ఒక్క ఓటును కీలకంగా భావిస్తున్నాయి. తమకు విజయాన్ని అందించే ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోవద్దు అని, ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి రంగంలోకి దిగిన ఆయా పార్టీల ఇంచార్జిలు తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి, మునుగోడు ఉప ఎన్నికను తమ భుజాలపై వేసుకొని ప్రయత్నిస్తున్నారు.
మునుగోడులో ఆసక్తికరంగా మారిన ప్రచార, ప్రలోభాల పర్వం
మునుగోడు ఓటర్ల వద్దకు వెళ్లి తమకు ఓటు ఎందుకు వేయాలి? పక్క వారికి ఎందుకు వెయ్యకూడదు? తమ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? పక్క పార్టీకి ఓటేస్తే ఏం నష్టం జరుగుతుంది? వంటి అంశాలను చెప్పడంతో పాటు కులాల వారీగా కూడా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. మందు, విందు, నగదు పంపిణీ, బహుమతులు ఇవ్వటం వంటి అనేక చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో మునుగోడులో ఆసక్తికరంగా ప్రలోభాల పర్వం కొనసాగుతుంది.
మునుగోడుపై టీఆర్ఎస్ ఫోకస్
ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ప్రతి ఓటరు పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మునుగోడులో విజయం కోసం శతవిధాలా ప్రయత్నిస్తుంది. మునుగోడులో ఓటమి పాలైతే దేశ రాజకీయాలపై ఎఫెక్టు పడే ప్రమాదం ఉందని భావించిన గులాబీ బాస్ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను మునుగోడులో రంగంలోకి దించి ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఇక మునుగోడులో ప్రచారాన్ని నిర్వహిస్తున్నవారు అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని ముందుకు సాగుతున్నారు.
ఓటర్లకు బంధుత్వం ఉన్నవారితో మాట్లాడిస్తూ అనుకూలంగా మార్చుకునే యత్నం
అంతేకాదు మునుగోడు ఓటర్లతో బంధుత్వం ఉన్న ఇతర నియోజకవర్గాల వారిని గుర్తించి, ఆ ప్రాంతంలో ఉన్న టిఆర్ఎస్ నేతలకు మునుగోడు లో ఉన్న ఓటర్ల బంధువుల తాలూకు సమాచారం అందించి, అక్కడ ఉన్నవారి బంధువులతో మాట్లాడించి ఇక్కడ వారిని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ లో వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా వారి బంధువులతో మాట్లాడిస్తూ మనం మనం ఒకటి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కొనసాగుతున్న ప్రచార హోరు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా కొత్త లెక్క
ఏదేమైనా మునుగోడులో సాగుతున్న రసవత్తర రాజకీయం, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు పడుతున్న కుస్తీలు, బంధువులతో మాట్లాడిస్తూ చేస్తున్న కొత్త ప్రయోగాలు వెరసి మునుగోడు ఉప ఎన్నిక పై రాష్ట్రవ్యాప్త ఆసక్తి నెలకొంది. ఇక మునుగోడులో నామినేషన్ల పర్వం కొనసాగుతుండటంతో ఇక ఎన్నికకు ఇట్టే సమయం లేదని దూకుడు పెంచిన అన్ని రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచాయి.