బీజేపీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు: కేంద్రమంత్రి సంచలనం!!
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి, బిజెపి రాష్ట్ర నాయకులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తుంది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని షామీర్పేట్ లో ఉన్న లియోనియా రిసార్ట్ లో తెలంగాణ బీజేపీ నేతల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు ప్రారంభమైన శిక్షణా కార్యక్రమం మూడు రోజుల పాటు సాగనుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజెపి నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, టిఆర్ఎస్ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ బీజేపీపై దాడి చేస్తుంది అందుకే
బిజెపి శిక్షణ తరగతులలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని బిజెపి నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ నేతలు కృషిచేయాలని పేర్కొన్న ఆయన వచ్చే ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన పనులు గురించి చెప్పుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ వద్ద ఏమీ లేవని, అందుకే బీజేపీ పై ఎదురుదాడి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

టీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు
టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు, కార్యకర్తలు, బ్యూరోక్రాట్లు బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మార్పు తప్పనిసరిగా కనిపిస్తుందని పేర్కొన్న కిషన్ రెడ్డి కేవలం అభద్రతా భావంతోనే టిఆర్ఎస్ పార్టీ బిజెపిపై విమర్శలు చేస్తోందని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైతే సంక్షేమ పథకాలను అమలు చేయమని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి, ప్రలోభపెట్టి గెలిచిందని పేర్కొన్నారు.

ప్రధాని మోడీని విమర్శిస్తే కేసీఆర్ స్థాయి పెరుగుతుందా ?
సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని కేవలం టిఆర్ఎస్ కండువా కప్పుకున్న వారికి మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ని విమర్శిస్తే తన స్థాయి పెరుగుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పై ఒత్తిడి తీసుకురావడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఫైల్స్ కి తాము భయపడేది లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి కుటుంబ పాలన సాగించే పార్టీ కాదని, బిజెపి ప్రత్యేకమైన పార్టీ అని పేర్కొన్న ఆయన బీజేపీ నుంచి ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ఎప్పుడు పార్టీ అధ్యక్షుడు అవుతారో చెప్పలేమని తెలిపారు. బిజెపి లో అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీబీఐ రాకుండా జీవో అందుకే ..
ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఉండాల్సింది బాగా డబ్బులు కాదని, ప్రజాక్షేత్రంలో మంచి పేరు ఉండాలని, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే నాయకులు కావాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సిబిఐకి భయపడి తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రాకను నిరాకరిస్తూ జీవో జారీ చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఏ పార్టీలోనైనా బేధాభిప్రాయాలు ఉంటాయని, పార్టీ విజయం కోసం అందరూ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి పని చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పోరాడాలని కిషన్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications