సర్వేలు: కారు సెంచరీ, బిజెపి సున్నా, కాంగ్రెస్ పాతాళానికే
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఘన విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చినట్లు సమాచారం. పార్టీ పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మూడు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది.
మూడు సర్వేల్లో ఇప్పటికే రెండు సర్వేల ఫలతాలు వచ్చాయి. మరో సర్వే ఫలితాలు రావాల్సి ఉంది. టీఆర్ఎస్ రాష్ట్రంలో వందకుపైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ఆ రెండు సర్వేలు తేల్చాయి.
మూడు ఏజెన్సీలతో సర్వేలు
కేసీఆర్ మూడు వేర్వేరు సంస్థలతో సర్వేలకు ఆదేశించినట్లు సమాచారం. ఈ సర్వేలు దాదాపు ది లక్షల మందిని సంప్రదించాయి. రెండు సర్వేల్లో కూడా టీఆర్ఎస్కు వందకు పైగా స్థానాలు వస్తాయని తేలింది. అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 119.
ఇన్ని సీట్లు వస్తాయని...
టీఆర్ఎస్కు 105 స్థానాలు వస్తాయని ఓ సర్వే చెప్పగా, 103 స్థానాలు వస్తాయని మరో సర్వే అంచనా వేసింది. మొత్తం మీద టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని సర్వేలు అంచనా వేశాయి. మూడో సర్వే నివేదిక వచ్చిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ మంత్రులకు, శాసనసభ్యులకు చెప్పారు.
బిజెపికి ఒక్క సీటు కూడా రాదని...
బిజెపికి ఒక్క సీటు కూడా రాదని ఓ సర్వే చెప్పగా, హైదరాబాదులో బిజెపి ఓ సీటు గెలుచుకుంటుందని మరో సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం బిజెపి శాసనసభ్యులు ఐదుగురు ఉన్నారు.
కాంగ్రెసు సీట్లు ఇవీ...
కాంగ్రెసు వచ్చే ఎన్నికల్లో ఏడు నుంచి 9 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని కేసీఆర్ చేయించిన సర్వేలు తేల్చాయి. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెసుకు 21 స్థానాలున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి కనీసం 70 అసెంబ్లీ స్థానాలు వస్తాయని కాంగ్రెసు పార్టీ సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.
కాంగ్రెసు ఓట్ల శాతం ఇదే...
మెజారిటీ నియోజవర్గాల్లో కాంగ్రెసు పార్టీకి 20 శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తాయని కేసీఆర్ చేయించిన సర్వేలో తేలింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మాత్రం కాంగ్రెసు ఓట్ల శాతం 37 నుంచి 45 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.