కేసీఆర్ మోదీని కలిసింది అందుకే... సంజయ్ అవగాహన పెంచుకుని మాట్లాడాలి.. : బాల్క సుమన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ లాంటి నేతపై సంజయ్ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ను ఎంతోమంది తేలిగ్గా తీసిపారేశారని... అందరి విమర్శలను పటాపంచలు చేస్తూ ఆయన రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం,రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించడం కోసమే కేసీఆర్ ప్రధాని మోదీని కలిశారని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ మోదీని కలవడం ఇదే మొదటిసారేమీ కాదని గుర్తుచేశారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర,రాష్ట్రాల మధ్య సంబంధాలపై కనీస అవగాహన లేకుండా... ఎన్నడూ ఏ సీఎం ప్రధానిని కలవనట్లుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధానమంత్రిని సీఎంలు కలవడం సాధారణమని స్పష్టం చేశారు. రాజ్యాంగంపై,రాజ్యాంగ వ్యవస్థలపై,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలపై సంజయ్ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎక్కని కొండ లేదు,మొక్కని బండ లేదని సుమన్ గుర్తుచేశారు. ఆనాడు ఏం చేసినా రాష్ట్ర సాధన కోసమే చేశారని... ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ఇకనైనా సంజయ్ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఆచీ తూచీ మాట్లాడాలని... స్థాయి లేని వాళ్లంతా ఆయన్ను విమర్శించడం సరికాదని అన్నారు.
కాగా,సోమవారం(డిసెంబర్ 15) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ కేసీఆర్పై తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 'కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పాం. వంగి.. వంగి.. పొర్లి దండాలు పెట్టినా మేము క్షమించేది లేదు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం.' అని సంజయ్ వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని... భారీ అవినీతికి తెరలేపారని సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారని ఆరోపించారు. నిధుల విషయంలో కేంద్రాన్ని బద్నాం చేయడానికే కేసీఆర్ ఢిల్లీ వచ్చారని సంజయ్ విమర్శించారు.