నయీం ఎవరో తెలియదు: తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో ఇటీవలే హతమైన గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలున్నాయని వెల్లువెత్తుతున్న ఆరోపణలు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్లో కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలు, భువనగిరి వ్యాపారి నాగేంద్రను నయీం బెదిరించినట్లు వెలుగులోకి వచ్చిన ఆడియో ఫుటేజీ ఆ పార్టీలో పెద్ద చర్చకు తెరలేపింది.
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్కు చెందిన మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, నిర్మాత నట్టి కుమార్ ఆరోపణలపై స్పందించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో మాట్లాడిన ఆయన గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. నయీం అనుచరులు తన గెస్ట్ హౌస్లో ఆయుధాలతో తిరిగారన్న ఆరోపణల్లోనూ ఎలాంటి వాస్తవం లేదన్నారు. నయీం ఘటనలు మీడియాలో చూసిన తర్వాత తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు.

నయీం ఓ ఫంక్షన్ హాల్ను డెన్గా మార్చుకుని సెటిల్మెంట్లు చేసినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అసలు ఆ ఫంక్షన్ హాల్ తనది కాదని, ఆ ఫంక్షన్ హాల్ను ఎప్పుడో అమ్మేశానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన ఫంక్షన్ హాల్ ఏమీ శివారు ప్రాంతంలో లేదని అది కంటోన్మెంట్ ఏరియాలో ఉందని అన్నారు.
నయీంతో కలిసి తానెలాంటి సెటిల్మెంట్లకు పాల్పడలేదని చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన నిర్మాత నట్టి కుమార్కు లీగల్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవసరమనిపిస్తే నట్టి కుమార్పై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications