కేసీఆర్కు సొంత పార్టీ ఎమ్మెల్యే ఝలక్: అమెరికానుంచి రాగానే ఇలా..అమలు జరిగేదెలా..?
సీఎం కేసీఆర్కు సొంత పార్టీ ఎమ్మెల్యే జలక్ ఇచ్చారు. ఇదేంటి అందరూ టీఆర్ఎస్ పంచన చేరుతుంటే గులాబీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే అధినేతకు జలక్ ఇవ్వడమేంటని అనుకుంటున్నారా..? ఇంతకీ జలక్ ఇస్తున్న ఎమ్మెల్యే ఎవరు..? అసలు జరిగిన కథ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
కరోనావైరస్ విజృంభణ
దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 190కి పైగా చేరుకోగా... దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి నలుగురు మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్యలో ఇటలీ చైనాను మించేసింది. అమెరికాలో కూడా కరోనాబారిన పడి 160 మందికి పైగా మృతి చెందారు. ఇక తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అమెరికా నుంచి తన భార్యతో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. ఇక అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది.
అమెరికా నుంచి వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కరోనావైరస్పై తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేస్తున్న క్రమంలో పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయితే ఈ జాగ్రత్తలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే పాటించకపోవడం సీఎం కేసీఆర్కు తలనొప్పిగా మారింది. తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అమెరికాకు వెళ్లి హైదరాబాద్కు వచ్చారు. అయితే హైదరాబాదుకు చేరుకోగానే ప్రత్యేక శిబిరంకు ఆయన వెళ్లలేదు. నేరుగా తన నియోజకవర్గానికి వెళ్లేందుకు రాష్ట్ర అధికారులు అనుమతించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు అమెరికా నుంచి వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరుగుతుండటం పై కూడా అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను కచ్చితంగా 14 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్న వేళ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను మాత్రం అధికారులు ఎందుకు విడిచిపెట్టారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నియోజకవర్గంలో పలువురితో టచ్లోకి వచ్చిన కోనప్ప
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన భార్యతో సహా బుధవారం అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకుని అదే రోజు రైలులో కాగజ్నగర్ చేరుకున్నారు. కాగజ్నగర్కు చేరుకున్న కోనప్ప మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అంతేకాదు తన భార్యతో కలిసి ఆసిఫాబాద్ జిల్లాలోని గానుగంపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంను కూడా సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనేరు కోనప్ప ముఖానికి మాస్క్ ధరించలేదని అదే సమయంలో చాలా మంది ప్రజలను ఆయన కలిశారని సమాచారం. ఇదిలా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా అమెరికా నుంచి వచ్చారు. ఆయనకు కరోనాపరీక్షల్లో నెగిటివ్ అని తేలినప్పటికీ గత ఆరురోజులుగా క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటి వరకు అరవింద్ కుమార్ ఎలాంటి అధికారిక సమావేశాలకు హాజరుకాలేదు.
Recommended Video
తనకు నెగిటివ్ వచ్చినందునే...
ఇక ఇదే విషయంపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వివరణ ఇచ్చారు. బుధవారం రోజున తాను అమెరికా నుంచి వచ్చినట్లు నిర్థారించిన కోనేరు కోనప్ప ఎయిర్పోర్టులో వైద్యపరీక్షలు చేయగా తనకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే నెగిటివ్ రావడంతో తాను క్వారంటైన్కు వెళ్లాల్సిన పనిలేదని భావించినట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి మురళీధరన్ కేరళలో ఓ హాస్పిటల్ను సందర్శించారు. అక్కడ స్పెయిన్ నుంచి వచ్చిన ఓ డాక్టరుకు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో మంత్రి మురళీధరన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మరో వైపు బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కూడా సౌదీ అరేబియా నుంచి రాగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
మొత్తానికి కరోనావైరస్ నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తుండగా.. మరోవైపు సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే పాటించకపోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది.