దుకాణాలు మూసేసి ఇంట్లో కూర్చోమంటోంది: ఎల్పీజీ ధరల పెంపుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరగడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు సామాన్యుల పట్ల వారి ఆవేదనను ప్రతిబింబిస్తున్నాయని కవిత ట్వీట్లో పేర్కొన్నారు.
ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర రూ.102 పెంచడం.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది రెండో అతిపెద్ద పెంపు అని కవిత అన్నారు. ''ప్రజలు దుకాణాలు మూసేసి ఇంట్లో కూర్చోవాలని ప్రభుత్వం ఏం ఆశిస్తోంది'' అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమార్తె కవిత వ్యాఖ్యానించారు.
గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెంచుతుందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
The actions and decisions of the Modi Government reflect on their insensitivity towards the common man.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2022
The price is of #LPG Commercial Cylinder has been hiked by 102₹, second major hike after elections.
What does the Govt expect, people to shut the shops and sit at home? https://t.co/w7ZLMS7Jzc
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వం రెండోసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను ఇంధన ధరలు, ఇతర వస్తువుల ధరలను పెంచింది. మాజీ పార్లమెంటు సభ్యురాలు కవిత ప్రజల సమస్యలను లేవనెత్తడంలో, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై స్పందించడంలో చురుకుగా ఉన్నారు.
ఇంధనం, ఎల్పిజి ధరల పెంపునకు వ్యతిరేకంగా మార్చి నెలలో కవిత ఇతర టిఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి హైదరాబాద్లో వీధుల్లోకి వచ్చారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇతర అధికార పార్టీ నేతలు హైదరాబాద్లోని ధర్నా చౌక్లో పొయ్యిలు వేసి రోడ్డుపైనే వంటలు వండి నిరసనలు చేపట్టారు. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు.