సీబీఐకి కవిత లేఖ: ఆ షరతులకు అంగీకరిస్తేనే- విచారణ తేదీ ఖరార్
హైదరాబాద్: టీఆర్ఎస్కు చెందిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు తెర తీసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ సీబీఐ ఈ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీన ఆమెను విచారించనుంది సీబీఐ. ఈ తేదీ ఇంకా ఖరారు కాలేదు. విచారణ తేదీని ఖరారు చేయడానికి కవిత షరతులు పెట్టారు.
సీబీఐకి లేఖ..
నోటీసులు అందిన తరువాత సీబీఐ అధికారులకు కవిత లేఖ రాశారు. 14035/06/2022 కింద జారీ అయిన నోటీసుల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తనకు అందజేయాలని కోరారు. వీలైనంత త్వరగా వాటిని పంపించాలని, దీనివల్ల విచారణకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, తగిన సమాధానాలను ఇవ్వడానికి తనకు వీలుగా ఉంటుందని చెప్పారు. అలాగే- హైదరాబాద్లో ఏ తేదీన విచారణకు చేపట్ట వచ్చో నిర్ధారించగలనని తేల్చి చెప్పారు.
ఢిల్లీ సీబీఐ ఏసీబీకి
ఢిల్లీ సీబీఐ, ఏసీబీ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ షాహీకి ఆమె ఈ లేఖ రాశారు. నిజానికి- సీబీఐ అధికారులు మంగళవారం కవితను విచారించాల్సి ఉంది. ఈ తేదీని ఆమె ఇంకా ఖరారు చేయలేదు. ఈ విషయాన్ని ఈ లేఖలోనే స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు అందిన తరువాతే విచారణ తేదీని నిర్ధారించగలనని పేర్కొన్నారు. తనపై నమోదైన ఫిర్యాదు కాపీలను కూడా కవిత సీబీఐ అధికారులకు అడిగినట్లు తెలుస్తోంది.
కేసీఆర్తో భేటీ తరువాతే లేఖ..
శనివారం ఆమె ప్రగతి భవన్లో తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. నోటీసుల గురించి వివరించారు. దీనిపై ఎలా ముందుకు సాగాలనే విషయం మీద చర్చించారు. దీన్ని ఎలా ఎదుర్కొనాల్సి ఉంటుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. న్యాయ సలహాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని తరువాతే ఆమె సీబీఐ అధికారులకు లేఖ రాశారు. నోటీసులు అందిన విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 12లోని కవిత నివాసానికి చేరుకున్నారు.
రిమాండ్ రిపోర్ట్లో..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా అందించిన రిమాండ్ రిపోర్ట్లో కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారంటూ వార్తలొచ్చిన మరుసటి రోజే సీబీఐ నుంచి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మరోవంక- టీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. ఇవి విచారణ కోసం పంపించిన నోటీసులు కావని స్పష్టం చేస్తోన్నారు. ఆమె నుంచి వివరణ తీసుకోవాలనే ఉద్దేశంలో సీబీఐ అధికారులు ఉన్నారని చెబుతున్నారు.
రాజకీయ దుమారం..
ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెనే టార్గెట్గా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక భారతీయ జనత పార్టీ కుట్ర ఉందనే ఆరోపణలు ఊపందుకుంటోన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల నోటీసులకు తాము ఏ మాత్రం భయపడబోమంటూ కవిత ఘాటుగా వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలో ఈ నోటీసులు ఆమెకు జారీ అయ్యాయి.