మా మాటేమిటి?: జితేందర్ రెడ్డి, ఏపీకి భారీ ప్యాకేజీతో అప్రమత్తం!
న్యూఢిల్లీ: విభజన చట్టంలో హైకోర్టు విభజన, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర అనేక అంశాలు ఉన్నాయని, వాటన్నిటినీ అమలు చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, కాజీపేట రైల్వే డివిజన్ చేయడం, గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీని పెంపొందించడం, రైల్-రోడ్డు కనెక్టివిటీని మెరుగుపర్చడం, జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం, వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం తదితరాలన్నీ ఉన్నాయన్నారు.
వీటి అమలు ఇప్పటి వరకూ కాలేదన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ ఎంపీల బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు.
కాగా, ఏపీతో తెలంగాణ ప్రభుత్వం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఏపీకి కేంద్రం ఏం ఇస్తే దానికి అనుగుణంగా పావులు కదిపేందుకు కెసిఆర్ ప్రభుత్వం యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి భేటీ మేరకు ఆ రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణకూ ప్యాకేజీ కావాలని కోరడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్దమయ్యారు.
తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖలు రాస్తానని ఆయన చెప్పారు.