కిషన్ రెడ్డిని ఏకేసిన కల్వకుంట్ల కవిత: మోడీపై విసుర్లు
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఉపఎన్నికలో మాట్లాడటం కాదని, తెలంగాణ అభివృద్ధి గురించి మోడీ వద్ద కిషన్ రెడ్డి మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు పదుల సంఖ్యలో విద్యా సంస్థలు ఇస్తున్న కేంద్రం, తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు రావాల్సిన వాటిని కేటాయించడంలేదని విమర్శించారు. మూసి నది ప్రక్షాళనకు నిధులడిగితే ఇప్పటికీ ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఏపీ రాజధాని అమరావతికి మాత్రం వెంకయ్యనాయుడు వేలకోట్లలో నిధులు మంజూరు చేయిస్తున్నారన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హర్టికల్చర్ యూనివర్సిటీని కేటాయించారు. కానీ దానికి ఒకసారి మాత్రమే డబ్బులిచ్చారని ఆ తర్వాత ఇవ్వమని లేఖ రాశారని పేర్కొన్నారు. ఇదేం వివక్షో అర్థం కావడంలేదన్నారు.
విభజన తర్వాత రాష్ట్రంలో ట్రైబల్ సంఖ్య పెరిగిందని ట్రైబల్ యూనివర్సిటీ కావాలని కోరితే అతిగతీలేదన్నారు. హౌజింగ్ పథకం కింద దేశం మొత్తంమీద రూ.4 వేల కోట్లు కేటాయిస్తే అందులో అర్ధభాగం వరకు అంటే సుమారు రెండు వేలకోట్లు ఏపీకే కేటాయించారన్నారు. కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తూ మమ్మల్ని పనిచేయడంలేదంటూ కిషన్రెడ్డి అనడంపై ఆమె మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తడి తెస్తామన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఎన్ని చేసినా మాకు సంబంధం లేదు కానీ తెలంగాణ సర్కార్ను మాత్రం బద్నా చేయొద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పాటై ఇన్ని నెలలవుతోన్న ఇంకా హైకోర్టు విభజన చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక హైకోర్టు అంశాన్నే కేంద్రం మరిచిపోయిందని ఆమె మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావించారని ఎన్నికలు అయిపోగానే దాని సంగతే మర్చిపోయారన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి, బీజేపీ నేత కిషన్రెడ్డి హైకోర్టు విభజన ప్రస్తావనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు చిన్నచిన్న ప్రాజెక్టుల కింద ఇచ్చే నిధులను కూడా రద్దు చేశారని తెలిపారు.
సీఎం కేసీఆర్ జూన్ 2014లోనే 14 అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. అయినా కేంద్రం బేఖాతర్ చేస్తూ ఇప్పటికి ఈ అంశాలను నెరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారని కేంద్రం పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.












Click it and Unblock the Notifications