trs పేరు మార్పుపై బహిరంగ ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పేరుతో ఈ ప్రకటన జారీ అయ్యింది. పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని తెలిపారు. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలన ప్రకారం అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది.
దీనికోసం స్థానికంగా వెలువడే పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ పార్టీ ప్రకటనలివ్వాలి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈసీ ప్రకటన జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక కిందకు తీసుకురావడంకన్నా జాతీయపార్టీ ఏర్పాటుద్వారా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఆయన పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. అందరూ బీఆర్ఎస్ పేరుపై ఏకగ్రీవంగా అంగీకారాన్ని తెలియజేశారు. పేరు మార్చిన తర్వాత ప్రధానంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు గుజరాత్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని ఓట్లు పొందేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓటింగ్ కలిగివుండాలనేది ఎన్నికల సంఘం నిబంధన.