ఆటుపోట్లను తట్టుకుని అలుపెరుగని ప్రయాణం .. టీఆర్ఎస్ పార్టీ 20వ అవతరణ దినోత్సవం
ఆటుపోట్లను ఎదుర్కొని , అష్టకష్టాలను భరించి తెలంగాణా రాష్ట్రం సాధించటంలో కీలక భూమిక పోషించింది తెలంగాణా రాష్ట్ర సమితి. సబ్బండ వర్ణాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి తెలంగాణా రాష్ట్రాన్ని సాకారం చేసింది . ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా నీలి నీడలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకుంటున్నా తెలంగాణా ప్రజల మనసుల మీద బలమైన ముద్ర వేసిన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు తనదైన పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ పై వన్ఇండియా ప్రత్యేక కథనం .
Recommended Video
20 వసంతాలను పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ
ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిళ్ళు ...ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది.. స్పూర్తి ప్రధాతా వందనం ...ఉద్యమ సూర్యుడా వందనం అంటూ సీఎం కేసీఆర్ కు నేడు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జై కొడుతున్నాయి. 20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సావ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగుతున్న ప్రస్థానం .. నాడు కష్టాలను , నష్టాలను , అవమానాలను దిగమింగి జై తెలంగాణా అని నినదించిన ఉద్యమం గుర్తు చేసుకుంటున్న సందర్భం.
2001 ఏప్రిల్ 27 న రెండు దశాబ్దాల క్రితం పుట్టిన ఉద్యమ పార్టీ .. పార్టీ ఏర్పాటుకు రీజన్ ఇదే
2001 ఏప్రిల్ 27 న రెండు దశాబ్దాల క్రితం తెలంగాణా రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీగా పుట్టింది. నీళ్ళు, నిధులు, నియామకాల్లో తెలంగాణా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటానికి అప్పటికే ఎంతో కాలంగా ఉన్న తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు నడిపించటానికి ఆవిర్భవించిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి. తెలంగాణా జాతిని విముక్తంచేయడానికి కేసీఆర్ ఉద్యమపార్టీని స్థాపించి తొలి అడుగు వేశాడు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. మొదట ఎన్నో బాలారిష్టాలను చూసింది. పెద్దగా ప్రభావం కూడా చూపించలేకపోయింది. కానీ కేసీఆర్ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఒక అపర భగీరధుడిలా ప్రయత్నం చేశారు.
తెలంగాణా రాష్ట్ర సాధనకు ప్రజలను చైతన్యం చెయ్యటంలో కీలక భూమిక
ప్రజలను చైతన్యం చెయ్యటంలో టీఆర్ఎస్ పార్టీ కీలకంగా వ్యవహరించింది. త్యాగాల పునాదుల మీద ఉవ్వెత్తున ఎగసిన కడలి తరంగంలా టీఆర్ఎస్ ప్రజలతో కలిసి సాగించిన పోరాట ఫలితమే నేటి తెలంగాణా రాష్ట్రం . సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ కలను సాకారం చేసుకొన్న ఉద్యమపార్టీ ఆ తరువాత రాజకీయ పార్టీగా , అధికార పార్టీగా అంచలంచెలుగా ఎదిగి నేటికీ తెలంగాణా రాష్ట్రంలో పాలన సాగిస్తుంది . ఉద్యమ నాయకుడే నేటి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
నవ్విన నాప చేను పండిన చందంగా .. ఊహించని విజయాలతో అధికార పార్టీగా
సీఎం కేసీఆర్ తాను సాగించిన రాజకీయ ప్రస్థానంలో అప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ ఉమ్మడి శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పదవికి 2001, ఏప్రిల్ 21న రాజీనామా చేసి, 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించారు.కేవలం తెలంగాణా రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఆవిర్భవించింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందన్న భావంతో పద్నాలుగేళ్ళ పాటు అవిశ్రాంతంగా ఉద్యమాన్ని సాగించిన కేసీఆర్ అనుకున్నది సాధించి సక్సెస్ అయ్యారు . టీఆర్ఎస్ ఒక పార్టీనా అని నవ్వినా వాళ్ళ నోర్లు మూయించారు . 2001, మే 17న తెలంగాణ సింహగర్జన భారీ బహిరంగసభలోనే కేసీఆర్ రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు.ఇక ఆయన సాగించిన పోరాటం, అందుకున్న విజయాలు పార్టీ ఖ్యాతికి కారణం అయ్యాయి. తెలంగాణా రాష్ట్ర సమితి పయనానికి తివాచీ పరిచాయి.