వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు; బీసీలకు కేసీఆర్ అన్యాయం: బండి సంజయ్
గత ఎనిమిది రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై, ప్రజా వ్యతిరేక విధానాలపై, సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి లో బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కెసీఆర్ బొమ్మతో ఎన్నికలకు వెళ్తే మునిగిపోతామన్న భయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రానున్న శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువవుతారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ బొమ్మతో ఎన్నికలకు వెళితే నిండా మునిగిపోతామనే భయం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో చేరే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.

ఇప్పటికే ఎన్నికల కోసం టీఆర్ఎస్ వసూళ్లు మొదలయ్యాయి
టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు విసిగిపోయారని పేర్కొన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల కోసం డబ్బులు వసూలు చేసుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని అనేక కంపెనీల నుండి నెల కిందట ఎన్నికల కోసం డబ్బులు వసూలు చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక ఈ నెల 21న మునుగోడు లో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు.

బీసీలను విస్మరిస్తున్న ప్రభుత్వం
వెనుకబడిన కులాల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో 10 శాతానికి మించి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీసీల సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులపై తాను లేవనెత్తిన ఆర్ టి ఐ ప్రశ్నలకు సమాధానాలను సంజయ్ ఉదహరించారు. ఎంబీసీ కార్పొరేషన్కు గత నాలుగు వార్షిక బడ్జెట్లలో రూ.3 వేల కోట్లు కేటాయించినా రూ.10 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు.

బీసీలకు కేటాయించిన బడ్జెట్ కు ఇచ్చిన దానికి పొంతన లేదు
బీసీలకు కేటాయించిన బడ్జెట్ కు ఇచ్చిన దానికి పొంతన లేదని మండిపడ్డారు. ఎంబీసీలకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 13,369 మందిలో కేవలం 1,419 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. గత ఎనిమిదేళ్లలో 5.70 లక్షల మంది బీసీలు స్వయం ఉపాధి పొందేందుకు దరఖాస్తు చేసుకోగా, కేవలం 50,000 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. నాయీబ్రాహ్మణుల (మంగలి) కోసం కేటాయించిన రూ.660 కోట్ల బడ్జెట్లో రూ.60 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, సంఘం నుంచి 35,651 మంది రుణాలకు దరఖాస్తు చేసుకోగా 7,375 మంది మాత్రమే రుణాలు పొందగలిగారన్నారు.

బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది
56,850 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 5,720 ధోబీలకు మాత్రమే రుణాలు అందాయని తెలిపారు. అలాగే గత మూడేళ్లుగా గొర్రెల పంపిణీ పథకం అమలు కాలేదని పేర్కొన్నారు. కల్లు గీత కార్మికుల కోసం జారీ చేసిన జిఓ 560 కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోయిందన్నారు. రాష్ట్రంలో 55 శాతానికి పైగా బీసీలు ఉన్నప్పటికీ వెనుకబడిన వర్గాల ఎమ్మెల్యేలు 22 మంది, కేబినెట్లో ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. బీసీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications