ఎన్టీఆర్ మండలాలు చేసినప్పుడు ఎందుకు వద్దనలేదు?
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారి అజ్ఞానానికి నిదర్శనమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
కొత్త జిల్లాల కోసం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు జరుగుతుంటే ఆ రెండు పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయనీ, అసలు వాళ్లకున్న అభ్యంతరాలేమిటో, ఎందుకు జిల్లాల పునర్విభజనను అడ్డుకోవాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని కోరారు.
టీడీపీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు లేని విజన్ ఇప్పుడు సీఎం కేసీఆర్కు ఉందనీ, పరిపాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం జిల్లాల పునర్విభజన చేపడుతుంటే ఇలా అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. జిల్లాల ఏర్పాటులో పొరపాట్లు జరిగితే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, సవరణ చేస్తామని తెలిపారు.

స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో మండలాల ఏర్పాటుపై రాని అభ్యంతరాలు ఇప్పుడు జిల్లాల విషయంలో ఎందుకు వస్తున్నాయని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.
దసరా పండుగనుంచి రాష్ట్రంలో 24-25 కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. పార్టీలు కోరుతున్నాయనో లేక నాయకులు డిమాండ్ చేస్తున్నారనో జిల్లాలు ఏర్పాటు చేయటం కుదరదని స్పష్టం చేశారు.
పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని 60-70 కిలోమీటర్ల వ్యాసార్థంతో నూతన జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. ఈ విషయంలో పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని, జూన్ 2 తర్వాత హైదరాబాద్లో వర్క్షాపు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications