తెలంగాణ గులాబీ మయం కావాలి..! అందుకోసం బాస్ రెండు చోట్ల పోటీ..!!
ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్ కు ఎలా కంచుకోటలా మారిందో దక్షణ తెలంగాణలో కూడా గులాబీ పరిమళాన్ని గుభాళింపచేయాలని సీయం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దక్షణ తెలంగాణ నుంచి కూడా ఎన్నికల బరిలో దిగేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. కాగా గతంలో ఎన్టీఆర్ కూడా ఇలాంటే ప్రయోగమే చేసి ఘన విజయం సొంతం చేసుకున్నారు. 1985లో నల్గొండ నుంచి బరిలోకి దిగిన ఎన్టీఆర్ 18000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఇప్పుడు కేసీఆర్ అదే నల్గొండ నుంచి పోటీ చేస్తే టీఆర్ఎస్ కు ఇలాంటి ఫలితమే వస్తుందని గులాబీ నేతలు ఆశించడంతో పాటు, శత్రు శేషానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కేసీఆర్ వస్తే ఓడించి పంపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంకుల సమరాన్ని తలపిస్తున్న నల్లగొండ ఎన్నికల కురుక్షేత్రంలో అస్త్ర శస్త్రాలకు ఎవరు ఎక్కువ పదును పెడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
దక్షిణ తెలంగాణపై కేసీఆర్ కన్ను..! ఉంటుందా నేతల వెన్నుదన్ను..?
ముందస్తు ఎన్నికలకు సిద్ధమౌతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యూహాలకు పదును పెడుతున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మరో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ అభివ్రుద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఊపుతెస్తున్నారు.సామాజిక వర్గాల వారీగా తాయిలాలను ప్రకటించి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకుని విపక్షాలను దెబ్బతీసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నారు.ఇదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నికల సమరానికి సన్నద్దం చేస్తున్నారు.వారికి అంగ, ఆర్థిక బలాన్ని ఇచ్చి ఓట్ల యుద్ధంలోకి దింపడానికి కేసీఆర్ ప్రణాళికలు రెఢీ చేశారు.
కాంగ్రెస్ బలంగా ఉన్న చోట దెబ్బ కొట్టాలి..! అందుకు నల్లగొండలో శ్రీకారం చుట్టాలి..!!
ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధమయ్యే లోగా గెరిల్లా పోరాట వ్యూహాంతో దెబ్బతీయాలన్నది గులాబీ బాస్ ఆలోచన. గెలుపుపైన ధీమాతో ఉన్నప్పటికి ముందు జాగ్రత్త చర్యలపైన కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాలపైన చంద్రశేఖర్ రావు ద్రుష్టి సారించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. దక్షణ తెలంగాణ మీద కేసీఆర్ ఆందోళనగా ఉన్నాడని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పెద్దగా ఫలితాలను రాబట్టలేకపోయింది. నల్గొండ,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్,టీడీపీ ఎక్కువ సంఖ్యలో సీట్లను దక్కించుకున్నాయి. ఈ సారి ఎలాగైనా ఈ జిల్లాల్లో కాంగ్రెస్ ను దెబ్బతీయాలన్నది కేసీఆర్ ఆలోచన. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉంది.కాకలు తీరిన నాయకులు ఆ పార్టీకి అండగా ఉన్నారు.ఎన్ని ఫిరాయింపులను ప్రోత్సహించినప్పటికి వీరు మాత్రం టీఆర్ఎస్ వైపు చూడలేదు.రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు కాంగ్రెెస్ ను ముందుండి నడిపిస్తున్నారు.
జిల్లాను శాసించే సత్తా జగదీశ్వర్ రెడ్డి కి లేదు..! అందుకే రంగంలోకి కేసీఆర్..!!
నల్గొండ,రంగారడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ కు తిరుగులేదన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చంద్రశేఖర్ రావు చూపు దక్షణ తెలంగాణ మీద పడింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లను సంపాదించి పెట్టడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారట. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి స్వయంగా పోటీ చేయడానికి చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారని సమాచారం. తాను బరిలో ఉంటే పార్టీ ఊపు రావడంతో పాటు కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టవచ్చునని ఆయన నమ్ముతున్నారని తెలుస్తోంది. ఇందు కోసం నల్గొండ జిల్లా నుంచి ఆయన పోటీ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది. ఇక్కడ పోటీ చేస్తే కాంగ్రెస్ బలంగా ఉన్న మునుగోడు,నకిరేకల్,దేవరకొండ,నాగార్జున సాగర్,మిర్యాలగూడా,కోదాడ,హుజూర్ నగర్,సూర్యాపేట మీద గట్టి ప్రభావం ఉంటుందని గులాబీ దళం అంచనా వేస్తోంది.
కాంగ్రెస్ దిగ్గజాలతో ఢీ కొట్టడం అంత సులువేనా..? గులాబీ బలం సరిపోతుందా..?
ఇదే సమయంలో సరైన నాయకత్వం లేకపోవడంతో నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ బలహీనంగా కనిపిస్తోంది.సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ దిగ్గజాలకు పోటీ ఇచ్చే స్థాయి లేదు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి టీఆర్ఎస్ ను గెలిపించే శక్తి కూడా ఆయనకు లేదు. సూర్యాపేట నుంచి ఆయన గెలవడమే కష్టమన్న రీతిలో జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నల్గొండ నుంచి బరిలోకి దిగితే పరిస్థితులు తారుమారు కావడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక వేళ నల్గొండ నుంచి వీలుకాకపోతే మిర్యాలగూడా నియోజకవర్గం నుంచి ఒక ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరో వైపు ప్రస్తుత నియోజకవర్గం గజ్వేల్ నుంచి కూడా కేసీఆర్ పోటీ చేయనున్నారు.ఈ నియోజకవర్గంలో తాను చేసిన అభివ్రుద్ధికి కనీసం లక్ష ఓట్లతో విజయం ఖాయమని చంద్రశేఖర్ రావు బలంగా నమ్ముతున్నారు.దీంతో పాటు ఉత్తర తెలంగాణ పైన ప్రభావం చూపించాలంటే గజ్వేల్ నుంచి తాను బరిలో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.