మోడీ సర్కార్పై దాడిని తీవ్రం చేసిన కేసీఆర్: పార్లమెంట్..బాయ్కాట్: ఇది టీజర్ మాత్రమే: టీఆర్ఎస్
హైదరాబాద్/న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ సర్కార్ గేరు మార్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్పై దాడిని తీవ్రతరం చేసింది. ఆందోళనల బాట పట్టనుంది. దేశ రాజధాని వేదికగా నిరసన ప్రదర్శనలను చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించాలని తీర్మానించుకుంది. ఇవ్వాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనుంది. పార్లమెంట్ ఆవరణలో గల మహాత్ముడి విగ్రహం వద్ద ప్రతిరోజూ నిరసనలను చేపట్టనుంది. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది టీఆర్ఎస్.
సమావేశాలు ముగిసేంత వరకూ..
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఈ మొత్తం సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. దీనికి బదులుగా- పార్లమెంట్ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలను నిర్వహించనుంది. నల్లబ్యాడ్జీలను ధరించడం, ప్లకార్డులను ప్రదర్శించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. వంటి చర్యలను చేపట్టనుంది.
ధాన్యం కొనుగోళ్ల కోసం
టీఆర్ఎస్కు ఎనిమిదిమంది లోక్సభ, ఏడు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రాజ్యసభ ఎంపీ బీ ప్రకాష్ రాజీనామా చేశారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ-కేసీఆర్ సర్కార్ మధ్య కొంతకాలంగా ధాన్య కొనుగోళ్లకు సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తాము కొనేది లేదంటూ కేంద్రం స్పష్టం చేస్తోంది. దేశ రాజధానిలో పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది.
ఇంతకంటే మంచి సమయం..
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఇంతకంటే మంచి సమయం రాదని టీఆర్ఎస్ భావించింది. మొత్తం పార్లమెంట్ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించినట్టవుతుందని చెబుతోంది. టీఆర్ఎస్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణ పూరక వాతావరణం మరింత ముదిరినట్టే. ఈ అంశం ఇప్పటికే రాజకీయ రంగును పులుముకొంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కాంగ్రెస్ కూడా దీనికి తోడైంది. రెండు పార్టీల వైఖరినీ తప్పు పడుతోంది.
రాజ్యసభలో వాయిదా తీర్మానం..
డిస్క్రిమినేషనరీ క్రాప్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్రాప్స్ ఫ్రమ్ తెలంగాణ అంశం మీద ఇవ్వాళ టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఇది చర్చకు రాలేదు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల సభ్యులు డిమాండ్ చేయడం, సభలో నినాదాలను వినిపించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
12 మంది సస్పెన్షన్ ఎత్తివేత కోసం..
మూడు వ్యవసాయ చట్టాల రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో దానిపై చర్చ జరగాలంటూ పట్టుబట్టిన 12 మంది రాజ్యసభ సభ్యులను ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్ను ఎత్తేయాలంటూ టీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తోంది. ఇవ్వాళ కూడా ఆ పార్టీ సభ్యులు కాంగ్రెస్, ఇతర పార్టీలలతో కలిసి సభలో నినాదాలను చేశారు. కేంద్రం చేసిన తప్పులను ఎత్తి చూపితే.. సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యం కాదని విమర్శించారు.