టీఆర్ఎస్ కీలక నిర్ణయం-ప్రధాని వ్యాఖ్యలపై రేపు పార్లమెంటులో సభా హక్కుల నోటీసు
2014లో పార్లమెంటులో జరిగిన ఏపీ విభజన ప్రక్రియకు సంబంధించి ప్రధాని మోడీ తాజాగా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడింది. తెలుగు రాష్ట్రాల విభజన కాంగ్రెస్ సరిగ్గా చేయలేదని, అందుకే ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు నెలకొన్నాయంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. దీంతో వీటిపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తోంది.
ప్రధాని మోడీ పార్లమెంటులో ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. దీనిపై సభా హక్కుల నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. పార్లమెంటులో ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలు రేపు సభా హక్కుల తీర్మానం కోరుతూ నోటీసు ఇవ్వబోతున్నారు. తద్వారా జాతీయ స్ధాయిలో ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని, వీటిపై చర్చ జరగాలని గులాబీ పార్టీ కోరుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రస్ధాయిలో మంత్రులు వరుసగా ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తుండగా.. ఇప్పుడు పార్లమెంటులో సభా హక్కుల నోటీసు ద్వారా తమ నిరసన తెలపాలని టీఆర్ఎస్ కోరుకోంటోంది.
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగుతున్నాయి. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కూడా ఇవాళ వీటిపై ఘాటుగా స్పందించారు. గుండెల్లో గునపాలు దింపేలా ప్రధాని మోడీ మాట్లాడారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజల్ని అవమానించారంటూ టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ కేశవరావు వ్యాఖ్యానించారు. అన్నిపార్టీలు మద్దతిచ్చిన ఏపీ పునర్విభజన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంటులో దీనిపై సభా హక్కుల తీర్మానంతో పాటు నిరసనలు కూడా తెలిపేందుకు టీఆర్ఎస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు.