2019లో సెంచరీ కొడతాం, రాహుల్ నోట అలాంటి మాటలా?: కేటీఆర్, కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఎలా?
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద సీట్లు గెలిచి సెంచరీ కొట్టనున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే మాట చెబితే.. 'అంత సీనా' అన్న అవతలి పక్షాలకు ఆ సీట్లు సాధించి గుణపాఠం చెప్పామని తెలిపారు.
సెప్టెంబరు 2న నిర్వహించనున్న ప్రగతి నివేదిన సభకు సంబంధించి నగరంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

చరిత్రలో నిలిచపోయేలా..
ఈ సందర్భంగా... కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలలో, మూడు నెలలో.. ఎప్పుడో ఓసారి ఎన్నికలు రాక తప్పదు.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.. అందుకే ప్రగతి నివేదన సభ. ఈ సభ తొలిసారిగా నగర శివారులో జరుగుతున్న నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలి. అవసరమైన వాహనాలను పార్టీ సమకూరుస్తుంది. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలి' అని అన్నారు.

రాహుల్ నోట అలాంటి మాటలా?
ప్రత్యేక రాష్ట్రం వస్తే అభివృద్ధి జరగదని విమర్శించిన వారి నోరు మూయించేలా దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్గాంధీ పేర్కొనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు. తాత ముత్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ వారే ఉన్నారని, పేరు చివరన గాంధీ లేకుంటే వారి పరిస్థితి ఎలా ఉండేదోనని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై టీడీపీ సొంత నేతలే..
కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. ఇష్టంలేని పొత్తులు ఎలా ఉంటాయన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు అభినందిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీకి చెందిన ఐదు సీట్లూ పోతాయన్నారు.

మరోసారి సీఎం కేసీఆరే..
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు మంచి రోజులు రానున్నాయన్నారు. రూ.50 వేల కోట్లతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. మెట్రో రెండో దశ సెప్టెంబరు రెండో వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానుందని వెల్లడించారు. మరోసారి తెలంగాణ సీఎం కేసీఆరేనని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications