TS EAMCET 2020: హాల్ టికెట్లు జారీ.. ఆ సర్టిఫికేట్ తప్పనిసరి,విద్యార్థులకు గైడ్లైన్స్ ఇవే..!
హైదరాబాదు: దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన పలు పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అనేక ఆందోళనల నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సక్సెస్ ఫుల్గా నిర్వహించగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అదే ఉత్సాహంతో ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది. ఈ హాల్ టికెట్స్ను TSCHE వెబ్సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించింది. విద్యార్థులు వెబ్సైట్ను సందర్శించి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా పేర్కొంది.
Recommended Video
తెలంగాణ ఎంసెట్
అంతకుముందు జూలైలో జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ పరీక్ష కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇక అన్ని జాగ్రత్త చర్యలు తీసకుని పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో పరీక్ష రాసేవారికి సెప్టెంబర్ 9, 10, 11 మరియు 14 తేదీల్లో ఉదయం మరియు మధ్యాహ్నం జరుగుతుంది. ఇక మెడికల్ మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్లో పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష సెప్టెంబర్ 28 మరియు 29 వ తేదీల్లో జరుగుతుంది. ఇక ఎంసెట్ పరీక్షతో పాటు మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగనున్నాయి. ఆగష్టు 31న ప్రారంభమైన ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు అక్టోబర్ 4వ తేదీ వరకు జరుగుతాయి. మొత్తం 4 లక్షల మంది విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
కోవిడ్ గైడ్ లైన్స్
ఇక కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని TSCHE కొన్ని సూచనలు చేసింది. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రంకు చేరుకన్నాక భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఇది పరీక్ష అయిపోయే వరకు పాటించి ఎగ్జిట్ ద్వారాం నుంచి బయటకు వెళ్లాలని పేర్కొంది. ప్రవేశం వద్ద ప్రతి విద్యార్థికి థర్మల్ స్కానింగ్ చేయడం జరుగుతుంది. టెంపరేచర్ చెక్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ డెస్క్ వద్ద శానిటైజర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసమయంలో వారి ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది.
పరీక్ష కేంద్రం వద్ద గుంపులుగా ఉండరాదు
పరీక్షా కేంద్రం బయట గుంపులు గుంపులుగా ఉండటం నిషేధం. పరీక్షా కేంద్రం బయట మునపటిలా రోల్ నెంబర్లు, పరీక్షా హాలు నెంబరు ఉన్న డిస్ప్లే బోర్డులు ఉండవని బోర్డు పేర్కొంది. ఒక్కసారిగా విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ కాగానే వారి హాల్ టికెట్ పరిశీలించిన తర్వాత వారు ఏ పరీక్ష హాలులోకి వెళ్లాలో సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు విద్యార్థులతో పాటు వచ్చే తల్లిదండ్రులకు ఎలాంటి వెయిటింగ్ హాల్ ఉండదని తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
కరోనా వైరస్ నెగిటివ్ సర్టిఫికేట్ ఇవ్వాలి
ఇక విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వచ్చే సమయంలో తమకు కరోనావైరస్ పాజిటివ్ లేదని పేర్కొనే సర్టిఫికేట్ను తమ వెంట తీసుకొచ్చుకోవాలని వెల్లడించింది. ఈ సర్టిఫికేట్ TSCHE వెబ్ సైట్లో పొందుపర్చినట్లు పేర్కొంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని వైద్యుని దగ్గర నుంచి పరీక్షలు చేయించుకుని ఆ ఫామ్ పై సంతకం పెట్టించుకోవాలని సూచించింది. ఇక పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది. ఒక పెన్, గ్లవ్స్, 50 ఎంఎల్ శానిటైజర్, వాటర్ బాటిల్ లోపలికి తీసుకువచ్చేందుకు అనుమతి ఉంది. దగ్గు, తుమ్ములు, జ్వరం లాంటి లక్షణాలున్న విద్యార్థులు ముందుగానే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.