తటాక ఊహా చిత్రాలు: తిరుమలలా 'వేములవాడ' రాజన్న ఆలయం (ఫోటోలు)
హైదరాబాద్: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను మరో తిరుమలలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికను సిద్దం చేసింది. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
సామాన్య భక్తులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను కూడా ఆకర్షించేందుకు ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మలిచేందుకు వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) అధికారులు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వేములవాడ క్షేత్రానికి ఆయన రూ. 100 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ ఓ బృహత్ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికపై దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్కిటెక్టులు రూపొందించిన ఆలయ నమూనాను అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన ద్వారా వివరించారు. వాస్తు దోషాలు లేకుండా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణాలు, కట్టడాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్తపతి వల్లినాయగంకు మంత్రి సూచించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని వీటీడీఏ అధికారులను ఆదేశించారు. వేములవాడ సమీపంలోని నాంపల్లి నుంచి వేములవాడ క్షేత్రం వరకు రోప్ వే ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

తిరుమలలా 'వేములవాడ' రాజన్న ఆలయం
టీటీడీ మాదిరి సామాన్య భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలని, ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉండేందుకు దేవతా వృక్షాలను నాటాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయ అధికారులకు సూచించారు. ఈ బృహత్ ప్రణాళికను యథావిధగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామని, ఆయన సూచనల తర్వాత దీనికి తుదిరూపం వస్తుందన్నారు.

తిరుమలలా 'వేములవాడ' రాజన్న ఆలయం
మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ నమూనాల్లో తుది మార్పులు, చేర్పులు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శృంగేరి పీఠానికి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. వేములవాడ క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు, ప్రత్యేక సందర్భాల్లో లక్షల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

తిరుమలలా 'వేములవాడ' రాజన్న ఆలయం
ఆలయానికి నాలుగు వైపులా గోపురాలు ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు, పడమటి వైపున 90 అడుగుల ఎత్తులో, ఉత్తరంవైపు 70 అడుగులు, దక్షిణాన 50 అడుగుల ఎత్తులో ఆలయ గోపురాలను వాస్తుప్రకారం నిర్మిస్తున్నారు. తిరుమల తరహాలో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమలలా 'వేములవాడ' రాజన్న ఆలయం
క్యూలైన్లలో మొత్తం 15 బ్లాకులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భక్తులు కూర్చునేందుకు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. క్యూలైన్లలో ఒక్కో బ్లాక్లో 500 మంది చొప్పున మొత్తం 7500 మంది భక్తులు పట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంవద్ద ప్రస్తుతం ఉన్న పుష్కరిణిని అభివృద్ధి చేయడంతోపాటు సమీపంలో నూతనంగా మరో పుష్కరిణిని ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications