మలక్పేట్ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతికి కారణమిదే: ఆపరేషన్ థియేటర్ మూత
హైదరాబాద్: నగరంలోని మలక్పేట్ ఆస్పత్రిలో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందింది. స్టెఫలో కోకస్ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకి బాలింతలు మృతి చెందారని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఆస్పత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించినట్లు తెలిసింది.
ఈ ఇద్దరితోపాటు అంతకుముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి అప్పటికప్పుడు తరలించారు. ఇందులో ఇందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో రెండు రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందని, కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
మరో 9 మందిని సోమవారం డిశ్చార్జ్ చేయగా, ఇంకా ఏడుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, మలక్పేట ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం విషమించడంతో నాగర్కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమపల్లికి చెందిన సిరివెన్నెల(23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని(24) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు 13న మృతి చెందారు.
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అయితే, వైద్యులది తప్పులేదని తొలుత ఉన్నతాధికారులు నిర్ధారించారు. తాజాగా, విచారణలో బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణమని తేల్చారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లు మూసివేశారు.