సీజే చెప్పినా వినరా?: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఉన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వం ఆస్పత్రుల్లో, ఇంటి వద్ద ఎలాంటి చికిత్స అందిస్తుందో తెలపాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది.
కరోనా చికిత్సకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది రాష్ట్రంలో ఎక్కడెక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి, చెస్ట్ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ పేషెంట్లకు చికిత్స
అందిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో కరోనా లక్షణాలు తక్కవగా ఉన్నవారికి సరోజినీ దేవి, ఆయుర్వేదిక్, నేచర్ క్యూర్ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
అయితే, కరోనా పరీక్షలు ఎక్కడెక్క చేస్తున్నారో ప్రసార మాధ్యమాల ద్వారా
తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనా వల్ల సాధారణ ప్రజలు
చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ లేకుండా
ఉంటోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి
చెప్పిన సూచనలు కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని మండిపడింది. ఇప్పటికే కరోనా విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణలో రోజ రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24,840 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకి 375 మంది మరణించారు. కాగా, కరోనా పరీక్షలను హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పెంచుతున్నట్లు తెలంగాణ సర్కారు తెలిపింది.












Click it and Unblock the Notifications