కరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో
తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి, అవసరమైతే లాక్ డౌన్ సైతం విధిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర హైకోర్టు తీరా ఎన్నికల విషయంలో మాత్రం అనూహ్యంగా స్పందించింది. కరోనా విలయం కొనసాగుతున్నప్పటికీ పెండింగ్ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయలేమని, ఏదైనా ఉంటే ఎన్నికల కమిషనర్ నే సంప్రదించాలని సూచించింది. ఎన్నికల రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో అడ్డంకులన్నీ తొలగిపోగా, షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ పార్థసారధి స్పష్టం చేశారు.
రద్దును తోసిపుచ్చిన కోర్టు..
మిగతా రాష్ట్రాల్లాగే తెలంగాణలోనూ కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న వేళ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం మరింత ప్రమాదరకరమని, ఎన్నికలు రద్దు చేసి, కొవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత సింగిల్ బెంచ్ ఎన్నికల రద్దును నో చెప్పింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా తాము ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఆ తీర్పును సవాలు చేస్తూ షబ్బీర్.. డివిజన్ బెంచ్ కు వెళ్లగా, సీజే కోహ్లీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సైతం అదే రకంగా స్పందించింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయలేమన్న హైకోర్టు.. దీనిపై ఎస్ఈసీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఆ వెంటనే..
ఎన్నికలకే సర్కారు మొగ్గు..
మున్పిపల్ ఎన్నికల రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే మీమాంస వీడినట్లయింది. ఆ వెంటనే ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్ పార్థసారధిని కలిసి ఎన్నికలపై చర్చించారు. కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చారు.
సర్కారు కోరినట్లే ప్రక్రియ యథాతథం
ప్రభుత్వ అధికారులతో మీటింగ్ తర్వాత ఎస్ఈసీ పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ర్ట ప్రభుత్వం కోరిందని తెలిపారు. అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని పేర్కొన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం ఆపాలని ఆదేశించారు. దీంతో 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.
కరోనా విలయం: సుప్రీం సంచలనం -దేశంలో ఎమర్జెన్సీ -మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా? పూర్తి లాక్డౌన్?