తెలంగాణ ఎన్నికల ఫలితాలు : జంప్ జిలానీలకు ఓటర్ల వాతలు- బీఆర్ఎస్ కు మారిన 12 మందిలో 10 మంది ఓటమి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకూ అందుతున్న ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే ఇవాళ వెలువడుతున్న ఫలితాలు ఓటర్లు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ అధికార పార్టీల్లోకి ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిపోయారు. అధికార బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగిపోయి వీరంతా కారెక్కేశారు. సొంత పార్టీ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా వీరంతా కేసీఆర్ కు జై కొట్టేశారు. అలాగే ఈ ఐదేళ్లూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చెలామణి కావడమే కాకుండా కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కూడా కొనసాగారు. అలాంటి వారికి ఇప్పుడు తెలంగాణ ఓటర్లు భారీ షాకిచ్చారు.

ఇవాళ వెలువడుతున్న తెలంగాణ ఎన్నికల తాజా ఫలితాల్లో గతంలో బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందికి ఓటర్లు వాతలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి,పినపాకలో రేగా కాంతారావు,కొత్తగూడెంలో వనమావెంకటేశ్వరరావు, ఇల్లందులో హరిప్రియ నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వారిలో ఇద్దరు మాత్రం గెలుపు బాటలో ఉన్నారు. వీరిలో మహేశ్వరం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. వీరు మినహా మిగతా వారంతా ఓటమి పాలవ్వడంతో ఓటర్లు ఫిరాయింపు రాజకీయాలపై ఎంత విసుగ్గా ఉన్నారో అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications