TS Polls: తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా ఆ ఓట్లు ? చాలా చోట్ల ఫలితాన్ని తేల్చేవి అవే..!
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజుల ప్రచారం మాత్రమే మిగిలుంది. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో చాలా చోట్ల హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు ఏకపక్ష వాతావరణం కనిపించేది. కానీ ఈసారి మాత్రం ముక్కోణపు, చతుర్ముఖ పోటీలతో పాటు పలు చోట్ల ముఖాముఖీ పోరు కనిపిస్తోంది. ఇందులో ప్రతీ ఓటు కీలకంగా మారిపోతోంది.
తెలంగాణ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్నాయి. పోల్ మేనేజ్ మెంట్ లో దిట్ట అయిన బీఆర్ఎస్ ఈసారి పలు సీట్లలో వెనుకంజలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అసలే 119 సీట్ల అసెంబ్లీలో ఓ పది స్దానాలు కూడా పార్టీల అధికారాన్ని నిర్ణయించే పరిస్దితి ఉంది. అలాగే ఒక్కో సీటులో ఒక్కో ఓటు పోగేస్తే తప్ప అభ్యర్ధులు స్వల్ప మెజార్టీతో బయటపడే పరిస్దితులు కనిపిస్తున్నాయి. దీంతో సహజంగానే సాధారణ పోలింగ్ లో పడని పోస్టల్ ఓట్లు, ఇంటి నుంచి పడే ఓట్లపై పార్టీలు దృష్టిసారించాయి.

రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో సర్వీస్ ఓట్లతో పాటు ఇంటి నుంచి ఓటేస్తున్న వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. వీరికి ఓటు వేసేందుకు ఎల్లుండి వరకూ ఈసీ గడువు ఇచ్చింది. దీంతో వీరితో ఎలాగైనా తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పార్టీలు తంటాలు పడుతున్నాయి. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్ధులు వీరి ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు.
అయితే పోస్టల్ ఓట్లలో ఎక్కువగా ఉండే ఉద్యోగులు ఈసారి బీఆర్ఎస్ కు మద్దతివ్వడం కష్టమేనని చెప్పేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు అయినా పూర్తి స్ధాయిలో తమకు అనుకూలంగా వేయించుకుంటే గట్టెక్కవచ్చని హోరాహోరీ పోరు సాగుతున్న పలు సీట్లలో అభ్యర్ధులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications