Rapido: హైదరాబాద్ ఓటర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్-పోలింగ్ రోజు ఉచిత రైడ్ లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగబోతోంది. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇంటి నుంచే ఓటు హక్కు కల్పించడంతో పాటు సర్వీస్ ఓటర్లకు కూడా చేరువవుతోంది. అదే సమయంలో పలు ప్రైవేటు సంస్ధలు కూడా పోలింగ్ శాతం పెంచేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో బైక్ ప్రయాణాల సంస్ధ ర్యాపిడో కూడా ఓటర్లకు ఓ ఆఫర్ ఇచ్చింది.
నవంబర్ 30న పోలింగ్ తేదీ నాడు హైదరాబాద్ లో ఓటు వేయాలనుకునే ఓటర్లకు నగరంలోని 2600 పోలింగ్ బూత్ లకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ర్యాపిడో సంస్ధ ఇవాళ ప్రకటించింది. తద్వారా హైదరాబాద్ లో ఓటర్లు సమీప ప్రాంతాలకు వెళ్లి ఓటు వేసేందుకు ప్రయాణ సౌకర్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ లో పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ర్యాపిడో ఈ ఆఫర్ ప్రకటించింది.

తెలంగాణలో, ముఖ్యంగా యువ ఓటర్ల సంఖ్యను పెంచడంలో రాపిడో నిబద్ధతకు ఇది నిదర్శనమని సంస్ధ ఓ ప్రకటనలో తెలిపింది. భారత ప్రజాస్వామ్యం దాని అతిపెద్ద హైలైట్ అని, ప్రతి ఓటును లెక్కించడంలో ఇబ్బందుల్లేకుండా చేస్తున్నందుకు తాము గర్విస్తున్నామని సంస్ధ వెల్లడించింది. రవాణా గురించి ఆందోళన చెందకుండా ఓటు వేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతోంది. ఎన్నికల రోజున ఉచిత బైక్ రైడ్లను సులభతరం చేయడం ద్వారా, పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని తాము భావిస్తున్నట్లు తెలిపింది.
ఓటరు భాగస్వామ్యానికి రవాణాను ఒక కీలకమైన అంశంగా గుర్తిస్తూ, ర్యాపిడో ఉచిత రైడ్ల ఆఫర్ ఎన్నికల ప్రక్రియలో విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ప్రజాస్వామ్య పండుగలో చాలా మంది చురుగ్గా పాల్గొనగలరని ఆశిస్తున్నట్లు ర్యాపిడో వెల్లడించింది.












Click it and Unblock the Notifications