TSRTC నయా రికార్డ్.. 5 రోజుల్లోనే రూ. 140 కోట్ల ఆదాయం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేశారు. ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మి అతివల జీవితంలో అనూహ్య మార్పులు తెచ్చింది. దాదాపు 18 నెలల కాలంలో తెలంగాణలో మహిళలు మహాలక్ష్మి పథకం కింద రూ. 200 కోట్ల ప్రయాణాలు పూర్తి చేశారని ఇటీవల అధికారులు తెలిపారు.
మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గరిష్ఠంగా 35 శాతం ఉండేదని.. ప్రస్తుతం ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని TSRTC అధికారులు స్పష్టం చేస్తున్నారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషో గతంలో గరిష్ఠంగా 68 శాతం ఉండగా.. అది ప్రస్తుతం 105 శాతానికి చేరిందని తెలిపారు. అయితే తాజాగా TSRTC మరో ఘనత సాధించింది. రాఖీ పౌర్ణమితోపాటు వరుస సెలవుల కారణంగా తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డును నమోదు చేసింది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ సంస్థకు సుమారు రూ. 140 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇటీవల రాఖీ పండుగతో పాటు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ మేరకు సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేసింది. అలానే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధర మీద 50 శాతం పెంచింది. అందుకే ఆర్టీసీకి ఇంత భారీగా ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ నెల 9న 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. అలాగే ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారిగా అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది 2.28 కోట్ల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గతేడాదితో పోలిస్తే 53 లక్షల కిలో మీటర్లను అదనంగా సంస్థ నడిపింది.












Click it and Unblock the Notifications