తిరుమల వెళ్ళే వారికి గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. రూ.300 దర్శనం టిక్కెట్ల జారీ!!
టిఎస్ఆర్టిసి తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టిఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే వారికి టికెట్ తో పాటుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు టోకెన్ లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ తిరుమల తిరుపతి దేవస్థానం తో ఒక అంగీకారాన్ని కుదుర్చుకుంది.

టీఎస్ ఆర్టీసీలో తిరుమల వెళ్తే 300 రూపాయల దర్శనం టోకెన్లు కూడా
దీని ప్రకారం 300 రూపాయల దర్శనం టికెట్లను టిఎస్ఆర్టిసి వెబ్ సైట్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తక్షణమే అమలులోకి వచ్చేలా రోజూ 1,000 మంది ప్రయాణికులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను జారీ చేయడానికి అనుమతినిచ్చింది. దీనివల్ల ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ, సురక్షితమైన రవాణా మెరుగుపడుతుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

దర్శనం టికెట్ల కోసం రెండు రోజుల ముందే బుక్ చేసుకోవాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
టిఎస్ఆర్టిసి వైస్ చైర్మన్ మరియు ఎండి వి సి సజ్జనార్ మాట్లాడుతూ, ఈ దర్శన టిక్కెట్లు పొందాలని అనుకున్నవారు ప్రయాణానికి రెండు రోజుల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సులో టికెట్ రిజర్వేషన్ చేసుకోవలసి ఉంటుందని వెల్లడించారు. ప్రయాణీకులు తప్పనిసరిగా రెండు డోసుల టీకా ధృవీకరణ పత్రాన్ని లేదా తేదీ దర్శనానికి 72 గంటలలోపు పొందిన కోవిడ్ -19 నెగటివ్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి రాజ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎండి సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆర్టీసీని లాభాల బాటలో తీసుకెళ్ళే పనిలో సజ్జనార్
ఇప్పటికే ఆర్టీసీని లాభాల బాటలో ముందుకు తీసుకు వెళ్లడం కోసం టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు జనాదరణ పెరగాలని రకరకాల స్కీమ్లను ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆర్టీసీలో మౌలికవసతుల కల్పన పైన కూడా దృష్టి సారించిన ఎండి సజ్జనార్ ఆర్టీసీని లాభాల లోకి తీసుకు రావడం లక్ష్యంగా కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

టీటీడీతో ఒప్పందం.. ఇక తిరుమలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుగమం
తెలంగాణ రాష్ట్రంలో వివాహాలు జరుపుకోవాలని భావించే వారికి బస్సులను అద్దెకు ఇవ్వడం తో పాటుగా, వధూవరులకు ఆర్టీసీ నుండి బహుమతులను కూడా అందించి శుభకార్యాలకు బస్సులు బుక్ చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఇక ఏకంగా ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే 300 రూపాయల టోకెన్లను కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. దీంతో ఇక తిరుమలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుగమం అయ్యిందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications