ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ సవాల్: అలా చేస్తే..కార్మిక సంఘం రద్దు చేస్తాం: సమ్మె కొనసాగుతుంది..!
Recommended Video
ఆర్టీసీ భవిష్యత్..కార్మిక యూనియన్ల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారంటూ ఆరోపించారు. ఆర్టీసీ లాభ ..నష్టాల గురించి అధికారులు ముఖ్యమంత్రిని తప్పు దోవ పట్టించారని విమర్శించారు. ఎక్కడ కార్మికులకు 50 వేల జీతం ఇస్తున్నారో నిరూపించాలని డిమాండ్ చేసారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసారు. రాజకీయ పార్టీలకు ఎన్నికలకు ఉన్నట్లే తమ యూనియన్లకు ఎన్నికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. గతంలో ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని జేఏసీ నేతలు చెప్పారు. అదే సమయంలో నేతలు ప్రభుత్వానికి సవాల్ చేసారు.
అలా చేస్తే..సంఘం రద్దు చేస్తాం...
ముఖ్యమంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యల మీద ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. కార్మికులు..అధికారులు మంచివారని చెబుతున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని..అయితే యూనియన్ నేతల గురించి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. యూనియన్ల కారణంగానే ఆర్టీసీ నష్టపోతుందని చెప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో అశ్వద్దామ రెడ్డి ప్రభుత్వానికి ఒక సవాల్ చేసారు. ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే..తాము యూనియన్ ను రద్దు చేస్తామని స్పష్టం చేసారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే తమకు యూనియన్ల అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. కార్మికుల జీతాల విషయంలోనూ ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారని కార్మిక సంఘాల నేతలు వాదిస్తున్నారు. అదే విధంగా 67 శాతం జీతాలు పెంచామని చెప్పటం కూడా సరి కాదన్నారు.
జగన్ పైన ప్రశంసలు..కేసీఆర్ పైన విమర్శలు..
కార్మిక సంఘాలు నేతలు ఏపీ ముఖ్యమంత్రి పైన ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని..ఆరు నెలల్లో అక్కడ ఏం జరుగుతుందో చూడాలని చెప్పటం పైన వారు స్పందించారు. గురువారం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణా వ్యవస్థలోకి తీసుకొనే విధంగా మరో కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. అక్కడ నిర్ణయం అమలు దిశగా చర్యలు తీసుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం అద్దె బస్సుల ద్వారా లాభాలు వస్తున్నాయని..ఆర్టీసీ బస్సుల కారణంగా నష్టాలు వస్తున్నాయని చెప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. రాజకీయ పార్టీలకు ఏ రకంగా ఎన్నికలు వస్తాయో అదే విధంగా కార్మిక సంఘాలకు ఎన్నికలు ఉంటాయని అందులో ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏముంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ వ్యవస్థను కాదని..ప్రయివేటు రంగానికి కొమ్ము కాసే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు.
సమ్మె కొనసాగుతుంది..
కార్మికులు స్వచ్చందంగా ఆర్టీసీ డిపోలకు వెళ్లి ఉద్యోగాల్లో చేరాలని సూచించినా..కార్మిక సంఘాలు మాత్రం ఆ సూచనను పరిగణలోకి తీసుకున్నట్లుగా కనిపించటం లేదు. కార్మిక సంఘాల పైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏం చెప్పినా..డిమాండ్లు సాధించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. తమకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని.. అదే విధంగా తాము వేడుకుంటే 16 శాతం ఐఆర్ ఇచ్చారని..ముఖ్యమంత్రి మాత్రం నాలుగేళ్ల కాలంలో 67 శాతం జీతాలు పెంచామని చెప్పటం సరి కాదన్నారు. కార్మికులకు 50 వేల జీతాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పటం పైన మహిళా ఉద్యోగులు ఇప్పటికే స్పష్టం చేసారని కార్మిక సంఘాల నేతలు వివరించారు. ఇక, ముఖ్యమంత్రి అంత కఠినంగా చెప్పిన తరువాత కూడా..కార్మిక సంఘాల నేతలు మాత్రం ఎక్కడా మెట్టు దిగినట్లుగా కనిపించటం లేదు. దీంతో రానున్న రోజుల్లో ఆర్టీసీలో కీలక పరిణామాలు తప్పవా అనే చర్చ మొదలైంది.