ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: అధికారులతో సీఎం కేసీఆర్ చర్చలు, మంత్రి పువ్వాడకు గవర్నర్ ఫోన్..
ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పిటిషన్ విచారణ శుక్రవారం హైకోర్టు ముందుకురానుండటంతో భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రగతిభవన్లో ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఉన్నారు. ప్రధానంగా హైకోర్టు విచారణకు వచ్చే అంశంపై డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యలపై హైకోర్టు ధర్మాసనం రెండురోజుల క్రితం విచారించింది. శుభవార్తతో 18వ తేదీన రావాలని కోరింది. చర్చలు జరిపి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని స్పష్టంచేసింది. ఈ క్రమంలో రవణాశాఖ మంత్రి అజయ్, అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. శుక్రవారం కోర్టులో ఏం వాదనలు వినిపించాలనే అంశంపై సుదీర్ఘంగా డిస్కష్ చేశారు.

ఆర్టీసీ ఎండీని నియమించాలని హైకోర్టు స్పష్టంచేసినా.. నియమించలేదు. దీనిపై కూడా సమావేశంలో చర్చ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళి సై ఆరాతీశారు. సమ్మె గురించి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కు ఫోన్ చేశారు. సమ్మె గురించి వివరించాలని ఆర్టీసీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను గవర్నర్ వద్దకు మంత్రి పంపించారు. పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటీ అని గవర్నర్ ప్రశ్నించారు. సమ్మె గురించి గవర్నర్కు సునీల్ శర్మ వివరించారు. త్వరలో గవర్నర్ను మంత్రి పువ్వాడ అజయ్ కలిసే అవకాశం ఉంది.
గవర్నర్ తమిళి సై ఇటీవలే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ఆర్టీసీ సమ్మె, శాంతి భద్రతల పరిస్థితుల గురించి వివరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడం.. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి గవర్నర్తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Click it and Unblock the Notifications