సీఎం రాకపాయే.. ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడకపాయే.. కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్..! మరి ఆనాడు..!!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగడం లేదు. సమ్మె ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం కూడా చర్చలకు ఛాన్స్ లేదనడంతో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు, నిరసనలు చేస్తూ సమ్మెను మరింత హీటెక్కిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్న రాజకీయ నేతలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా నిరసన గళం వినిపిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా సమ్మెపై మాట్లాడిన దాఖలాలు లేవు. మంత్రులు తెరపైకి వచ్చి రాసిచ్చిన స్క్రిప్టులు వల్లె వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడబోతున్నారనేది హాట్ టాపికైంది. అయితే చివరి క్షణంలో ఆయన పర్యటన రద్దు కావడం చర్చానీయాంశంగా మారింది.
ఎన్నికల పర్వం.. ఆందోళన క్రమం
ఒకవైపు ఆర్టీసీ సమ్మె.. మరోవైపు హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక. ఈ రెండు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి టఫ్ ఫైట్లా మారాయి. సమ్మె విరమణకు కార్మికులు నై అంటుండటంతో దాన్ని ఎలా అధిగమించాలన్నది పెద్ద సవాల్గా మారింది. అటు కాంగ్రెస్ కంచుకోటైన హుజుర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా ఎలా వేయడమనేది క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. ఎలాగోలా హుజుర్ నగర్ స్థానం కైవసం చేసుకోవడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసిన గులాబీ బాస్కు ఇప్పుడు ఆర్టీసీ సమ్మె రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది.
ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
. ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని టీఆర్ఎస్ అధిగమిస్తుందా?
హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో టఫ్ ఫైట్కు సిద్ధమయ్యాయి. హుజుర్ నగర్ కాంగ్రెస్ కంచుకోట కావడంతో ఆ పార్టీ నేతలు బిందాస్గా ఉన్నట్లు కనిపిస్తోంది వ్యవహారం. అదే క్రమంలో ఆర్టీసీ సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి మరిన్ని ఓట్లు అధికంగా రాలతాయనేది హస్తం నేతల ఆలోచన. ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ బాస్తో పాటు గులాబీ నేతలు హుజుర్ నగర్ లో గెలుపు కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారు. అయితే ఆర్టీసీ సమ్మెను ఎలా అధిగమిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
మంత్రులే మాట్లాడారు తప్ప.. మీడియా ముందుకు రాని సీఎం
ఆర్టీసీ సమ్మెపై మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ మాట్లాడారే తప్ప సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవు. సమీక్షలు, పత్రిక ప్రకటనలు తప్ప ఆయన స్పందించలేదు. సమ్మెపై ప్రభుత్వ వైఖరిని అధికారులకు వివరిస్తున్నారే తప్ప మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఈ క్రమంలో గురువారం (17.10.2019) నాడు హుజుర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వస్తారనే నేపథ్యంలో.. ఆర్టీసీ సమ్మెపై ఆయన ఏమైనా మాట్లాడతారా అనేది ఉత్కంఠ రేపింది. అయితే చివరి క్షణంలో భారీ వర్షం పడిందనే కారణంతో ఆయన సభ రద్దయింది. భారీ ఏర్పాట్లు చేసిన తర్వాత కేసీఆర్ రావడం లేదనేది పార్టీ శ్రేణుల్లో నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు.
చిరంజీవితో ఆ బీజేపీ నేతలు.. అందరూ కలిసి అక్కడికే..!
హుజుర్ నగర్ పర్యటనపై ఉత్కంఠ.. చివరకు సభ రద్దు
ఆర్టీసీ సమ్మెపై నేరుగా ఇంతవరకు మాట్లాడని కేసీఆర్.. హుజుర్ నగర్ ప్రచారంలో ఆ టాపిక్ తీస్తారేమోననే చర్చ జోరుగా సాగింది. అసలు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడతారా లేదంటే ఎన్నికల ప్రచారం వరకు మాత్రమే ప్రసంగించి వెళ్లిపోతారా అనే ప్రశ్నలు తలెత్తాయి. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై మాట్లాడతారేమోనని భావించారు కొందరు. ఒకవేళ ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడితే ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. హైకోర్టులో సమ్మె పిటిషన్పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ దాని ఊసెత్తే పరిస్థితి ఉండదన్నారు మరికొందరు. కానీ కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్తో ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టినట్లైంది.
వర్షం కారణంగా సభ రద్దు..!
సీఎం కేసీఆర్ వస్తున్నారని పార్టీ క్యాడరంతా సిద్ధమయ్యారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేశారు. హుజుర్నగర్ టౌన్లో భారీ బహిరంగ సభ కోసం వేదిక సిద్ధం చేశారు. అయితే కుండపోత వర్షం కారణంగా సభా ప్రాంగణం చిత్తడిగా మారినట్లు తెలుస్తోంది. కేసీఆర్ హెలికాప్టర్లో అక్కడకు వెళ్లాల్సి ఉండటంతో ఏవియేషన్ అధికారులు వాతావరణం సహకరించని కారణంగా పర్యటన రద్దు చేసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. మరోవైపు వర్షం కారణంగా సభకు ప్రజలు కూడా తక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున.. ఆ సభ పెట్టి కూడా ప్రయోజనం ఉండదనే కోణంలో పార్టీ పెద్దలు ఆలోచించినట్లు తెలుస్తోంది.
కార్యకర్తలను రెచ్చగొట్టేది చంద్రబాబే.. అందుకే హత్యలు.. అసత్య ప్రచారమంటూ అంబటి ఆగ్రహం..!
ఆనాడు ఇంతకన్నా ఎక్కువ వర్షం.. సభ నడిపించారుగా..!
హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి కేవలం ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వారం రోజుల నుంచి శ్రమించి సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు టీఆర్ఎస్ నేతలు. చివరకు ఆయన రాకకు బ్రేక్ పడటంతో పార్టీ శ్రేణులు నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
అదలావుంటే వర్షం కారణంగా కేసీఆర్ సభ వాయిదా పడిందని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు. ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్లో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేసినప్పుడు ఇంతకన్నా బీభత్సమైన వర్షం పడిందని.. అయినా కూడా ఆనాడు సభ నిర్వహించారనే విషయం గుర్తు చేస్తున్నారు. హుజుర్నగర్కు కేసీఆర్ రాక నేపథ్యంలో ఆయన్ని అడ్డుకోవడానికి ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోగయ్యారని తెలిసి సభ రద్దు చేశారని వాదిస్తున్నారు మరికొందరు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేసీఆర్ పర్యటన రద్దయిందే తప్ప వర్షమో, మరో కారణమో కాదంటున్నారు.