ఉధృతంగా ఆర్టీసీ సమ్మె.. హైకోర్టుకు చేరిన మరో 3 పిటిషన్లు
హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరింది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు 21వ తేదీ నుంచి పది రోజుల వరకు కార్యాచరణ ప్రకటించారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేలా షెడ్యూల్ విడుదల చేశారు. అదలావుంటే ఈ నెల 28వ తేదీన మరోసారి హైకోర్టు విచారణ సందర్భంగా ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి సోమవారం (21.10.2019) నాడు హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వంతో పాటు కార్మిక సంఘాలకు కూడా నోటీసులు జారీ చేసింది. పాత పిటిషన్లతో పాటు సోమవారం నాడు దాఖలైన మూడు పిటిషన్లపై కూడా ఈ నెల 28వ తేదీన వాదనలు వింటామని స్పష్టం చేసింది న్యాయస్థానం.
ప్రగతి భవన్ ముట్టడి టెన్షన్ టెన్షన్.. రచ్చ రచ్చ.. ఆర్టీసీ జేఏసీ 10 రోజుల కార్యాచరణ
ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దాంతో కేసీఆర్ సర్కార్పై వత్తిడి పెంచేలా ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేయడానికి కార్మిక సంఘాల జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను కలవనున్నారు. ప్రస్తుత పరిస్థితిని, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేయడానికి 10 రోజుల కార్యాచరణ ప్రకటించారు జేఏసీ నేతలు. ఆ మేరకు సోమవారం (21.10.2019) నాడు ఆయా డిపోల పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు కార్మికులు.