కరీంనగర్ లో శ్రీవారి ఆలయం.. 20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామన్న టీటీడీ ఛైర్మన్!!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువైన వెంకటేశ్వరస్వామి అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎనలేని భక్తి. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేరువ చేయడానికి కరీంనగర్ కేంద్రంగా టీటీడీ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్ లో పది ఎకరాల స్థలాన్ని కూడా టీటీడీ ఆలయ నిర్మాణానికి కేటాయించారు. దీంతో కరీంనగర్ జిల్లా వాసులకు ఆ దేవదేవుడి దర్శనం మరింత చేరువ కానుంది. కరీంనగర్ జిల్లా వాసుల కల నెరవేర్చడం కోసం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా కృషి చేశారు.

ఈ కృషి ఫలితంగానే కరీంనగర్ కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్లోని నివాసంలో టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు, మంత్రి గంగులకు, టీటీడీ తెలంగాణా లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావులకు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు తెలంగాణలో శ్రీవారి ఆలయం నిర్మాణం చెయ్యనున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయానికి మే 31 వ తేదీన భూమిపూజ చేస్తామన్నారు.
మే 31వ తేదీ ఉదయం ఏడు గంటల 26 నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. త్వరిత గతిన శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరలోనే ఆలయాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications