ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో యాక్షన్, నిద్ర పట్టట్లేదు: హరీష్ రావు
మహబూబ్ నగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పని చేస్తున్నారని మంత్రి హరీష్ రావు గురువారం నాడు మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు.
ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం చేసే భూసేకఱణను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ పైన గవర్నర్ నరసింహన్కు తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం సరికాదన్నారు.
చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు యాక్షన్ చేయడం సరికాదన్నారు. రూ.3వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. తాము ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకోవడం ఏమిటని విపక్షాలను హరీష్ రావు ఈ సందర్భంగా నిలదీశారు.
కాగా, మంత్రి హరీష్ రావు గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సంగెంబండ వద్ద ఏర్పాటు చేస్తోన్న రిజర్వాయర్ను పరిశీలించారు. హరీష్ రావు వెంట పలువురు తెరాస నేతలు, అధికారులు ఉన్నారు.