మరికాసేపట్లో టీటీడిపి సీట్ల ప్రకటన..!గ్రేటర్ తెలుగు తమ్ముళ్లలో తొలగని ఉత్కంఠ..!!
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో ఓ ప్రముఖ గట్టానికి తెరపడబోతోంది. సీట్ల సర్దుబాటు అంశం పై చర్చోపర్చలు మహాకూటమి నేతలు ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి రాగలిగారు. టీజెయస్ చీఫ్ కోదండరాం ని కూటమి ఛైర్మన్ గా ఎన్నుకొనడమే కాకుండా అసంత్రుప్తితో ఉన్న సీపీఐని కూడా తమదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం దాదాపు పూర్తి చేసారు కూటమి పెద్దలు. ఆదివారం టీజేయస్ కార్యాలయంలో భేటీ ఐన ఉత్తమ్ కుమార్ రెడ్డి, యల్ రమణ, కోదండరాం, చాడా దాదాపు సానుకూల వాతావరణంలో చర్చలు ముగించినట్టు ప్రకటించారు. దీంతో సీట్ల సర్దుబాటు ప్రహసనానకి తెరపడినట్లైంది. ఇక మిగిలి ఉంది తమ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకోవడమే తరువాయి. కాగా గ్రేటర్ లో మంచి ప్రజాబలం ఉన్న తెలుగుదేశం పార్టీ కి ఏ అభ్యర్థి ఏ స్థానంలో పోటీ చేయబోతున్నారనే అంశం సస్పెన్స్ గా మారింది. నియోజక వర్గాలు ఖారారైనా అభ్యర్థులు ఖరారు కాక పోవడంతో తెలుగతమ్ముళ్లలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఐతే ఇదే రోజు సాయంత్రం వరరు తెలుగుతమ్ముళ్ల భవితవ్యం తేలిపోనుంది.
గ్రేటర్ తెలుగు తమ్ముళ్లలో నరాలు తెగే ఉత్కంఠ..! నేటి సాయంత్రమే అభ్యర్థుల ప్రకటన..!
తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదింపేందుకు ఏర్పడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు ఆ పార్టీ ల నేతలు. అభ్యర్థుల విషయమై కొన్ని లీకులు వచ్చినట్లు కూడా సమాచారం. అయితే దానిపై క్లారిటీ లేదని తెలుస్తోంది. దీనికితోడు ఆశావహులకు ప్రచారం చేసుకోమని కూడా టీడీపీ హైకమాండ్ నుంచి ఇంతవరకూ సమాచారం లేకపోవడంతో వారు మల్లగుల్లాలు పడుతున్నారట. మరోవైపు కొందరు నేతలు తమకు సీటు దక్కుతుందా? లేక చేజారుతుందా? అనే ఆందోళనలో టీటీడీపీ నేతలు సతమతమవుతున్నారని తెలుస్తోంది.
గ్రేటర్ లో తారాస్థాయిలో నెలకొన్న పోటీ..! సీటు ఎవరిని వరిస్తుందో..!!
ఇప్పటికే టికెట్ కోసం అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారంతా టెన్షన్లో మునిగిపోయారు. కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ కి మొత్తం 14 సీట్లు కేటాయించారని అంటున్నారు. దీంతో పార్టీ లోని కొద్దిమంది సీనియర్ నేతలు మినహా అసెంబ్లీ టికెట్ ఎవరికి దక్కుతుందో ఇంతవరకు స్పష్టంగా వెల్లడికాలేదు. మరోవైపు మహాకూటమి పొత్తులో భాగంగా తమ నియోజకవర్గం టీడీపీ కి దక్కుతుందా? లేక ఇతర పార్టీల కు వెళుతుందా అనేది తేలకపోవడంతో టీడీపీ ఆశావహులు ఏమిచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి కూకట్పల్లి నుంచి పోటీ చేయాలని తాపత్రయ పడుతుండగా, చంద్రబాబు నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.
సాయంత్రమే ప్రకటన..! సంయమనం పాటించాలంటున్న టీడిపి అదిష్టానం..!
అలాగే మరో నేత రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సం పేట సీటు కోసం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అయితే ఆ స్థానంలోకాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో పొత్తులో ఆ సిటు టీడీపీ కి వచ్చే అవకాశం కనపడటం లేదని సమాచారం. అలాగే కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు రెండు సీట్లు ఆశిస్తున్నారని సమాచారం. అయితే వీరికి పొత్తులో భాగంగా ఒక సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో దయాకర్ రెడ్డి మరో సీటు కూడా కావాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. టీడీపీ నేతలు మరో రెండు, మూడు సీట్లు కావాలని ఒత్తిడి చేయాలని చంద్రబాబును కోరుతున్నారు.
గెలుపుగుర్రాలం మేమే అంటున్న ఆశావహులు..! గ్రేటర్ టీడిపి లో ఉరకలేస్తున్న ఉత్సాహం..!!
టీడీపీ కి లభించే సీట్లలో సీనియర్ నేతలకు అవకాశం దక్కుతున్నదని తెలుస్తున్నప్పటికీ గ్రేటర్ సీట్ల విషయంలో స్ఫష్టత లేకపోవడంతో ఆశావహులు ఆందోళనలో మునిగిపోయారని సమాచారం. మరోవైపు శేరిలింగం పల్లి సిటు కోసంకోసం భవ్య ఆనంద్ ప్రసాద్, మొవ్వ సత్యనారాయణలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరిలో సిటు ఎవరికి దక్కుతుందో వెల్లడికాలేదు. అలాగే ఇటీవలే టీడీపీ లో చేరిన నందీశ్వర్ గౌడ్ పఠాన్ చెరు టికెట్ కోసం చంద్రబాబును కలిశారని ప్రచారం జరుగుతోంది. కూన వెంకటేష్ గౌడ్, సామా రంగారెడ్డి, ఎమ్ ఎన్ శ్రీనివాస్, అరవిందకుమార్ గౌడ్, గడీల శ్రీకాంత్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, బీయన్ రెడ్డవి, ఉప్పలపాటి అనూషా రాం తదితర గ్రేటర్ ఆశావహులు మాత్రం టెన్సన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో గ్రేటర్ టీడీపీ నేతల టెన్షన్ నేటి సాయంత్రంతో తీరిపోనుంది.