విధినిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ .. మానవత్వాన్ని చాటుకున్న కమిషనర్
హైదరాబాద్ : పోలీసు .. అంటే కఠిన హృదయమే కాదు. తన తోటి సిబ్బంది దూరమైతే అంతే వాత్యలాన్ని చూపించగలరు. ఆపద వస్తే ఆదుకోలరు. ఓ పోలీసు చనిపోతే .. ఆ కుటుంబానికి మేమున్నామని భరోసా కూడా ఇస్తారు. తిరిగి ఆ పోలీసును తీసుకురాలేమని .. కానీ కుటుంబాన్ని మాత్రం ఆదుకునేందుకు ముందుకొస్తామని చెప్తారు. ఈ పోలిక కరెక్టుగా సరిపోతుంది సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్కు. ఎందుకో తెలుసుకుందాం .. పదండి.
ఇదీ విషయం
ఓ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఇటీవల తెలంగాణ పోలీసులు బీహర్ వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో వారిని మృత్యువు కబళించింది. వారి వాహనం ప్రమాదానికి గురవడంతో మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ తులసీ రాం మృతిచెందాడు. అతని భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు, బంధువుల కన్నీటి వీడ్కోలు పలికారు. సీపీ సజ్జనార్ సహా ఉన్నతాధికారులు కూడా తులసీ రాం భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు.
పాడెమోసిన సీపీ ..
సాధారణంగా పోలీసులు చనిపోతే ఉన్నతాధికారులు వచ్చి పరామర్శిస్తారు. అండగా ఉంటామని భరోసానిస్తారు. కానీ సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మాత్రం అలా చేయలేదు. తన తోటి ఉద్యోగి చనిపోయాడని జీర్ణించుకోలేకపోయారు. బంధువులు, స్నేహితుడి మాదిరిగా అతని పాడెను మోసారు. ఇలా చేసి అయినా తన ఉద్యోగికి నివాళి అర్పిద్దామని అనుకున్నారు. సీపీ పాడె మోయడం చూసి అక్కడున్న వారు కూడా తులసీ రాం గొప్పతనం గురించి చర్చించుకున్నారు. ఓ సీపీ అంటే .. పై అధికారిగా కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తి అని చాటుకున్నారు.
ఆదుకుంటాం ..
తులసీ రాం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు సీపీ సజ్జనార్. విధి నిర్వహణలో చనిపోయిన అతడిని తీసుకురాలేమని .. కానీ అతని కుటుంబానికి మాత్రం అండగా నిలుస్తామని స్పష్టంచేశారు. తులసీ రాం ఫ్యామిలీకి పోలీసులు బాసటగా నిలుస్తారని హామీనిచ్చారు. అంతకుముందు షీ టీం డీసీపీ అనసూయ, ఏసీపీ అశోక్ చక్రవర్తి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు .. తులసీ రాం భౌతికకాయానికి నివాళులర్పించారు. తులసీ రాంకు హితులు, సన్నిహితులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.