టీవీ9 రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..! అయోమయంలో ఆర్పీ..!!
Recommended Video
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. సీఆర్పీసీ 41ఏ కింద రెండ్రోజుల క్రితం పోలీసులు రవిప్రకాశ్కు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో ఆదేశించారు. అయితే వారం రోజుల క్రితం జారీ చేసిన 160 సీఆర్పీసీ నోటీసుకు రవిప్రకాశ్ ఇంకా స్పందించలేదు. తనకు 10 రోజుల సమయం కావాలంటూ న్యాయవాది ద్వారా కోరారు.
రవి ప్రకాష్ కి రెట్టింపైన కష్టాలు..! ముందస్తు బెయిల్ తిరస్కరించిన కోర్ట్..!!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రవిప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారనుకుంటే మళ్లీ రావాలని హైకోర్టు సూచించింది. సీఆర్పీసీ 154 ప్రకారం విచారణ జరపాలని రవిప్రకాష్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. అంత అత్యవసరం కాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్రావు ఫిర్యాదు మేరకు ఈ నెల 9న రవిప్రకాశ్ ఇంట్లో సైబర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయనపై ఫోర్జరీ, డేటాచోరీ కేసులు నమోదు చేశారు.
విచారణకు హాజరుకాని ఆర్పీ..! అరెస్టు తప్పదంటున్న పోలీస్ వర్గాలు..!!
మే 10వ తేదీన టీవీ9 కార్యాలయంలోకి రోజూ మాదిరిగానే వెళుతున్న రవిప్రకాష్ను పోలీసులు అడ్డుకున్నారు. లోపల వాటాదారుల సమావేశం జరుగుతోందని, బలవంతంగా కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే కస్టడీలోకి తీసుకుంటామని రవిప్రకాష్కు పోలీసులు బదులిచ్చారు. అనంతరం టీవీ9 సీఈవో బాధ్యతల నుంచి రవిప్రకాష్ను కొత్త యాజమాన్యం తొలగించడం, కొత్త సీఈవోను ప్రకటించడంతో టీవీ9తో రవిప్రకాష్కు ఉన్న అనుబంధం దాదాపుగా తెగిపోయింది. అప్పటి నుంచి రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినా స్పందిచలేదు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. నేడు విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇంకా అజ్నాతంలో రవి..! గాలిస్తున్న పోలీసులు.!!
టీవీ 9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాశ్పై సైబరాబాద్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాశ్..మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద సంస్థ డైరెక్టర్ పి.కౌశిక్రావు పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. వాటిపై పోలీసులు రవిప్రకాశ్తోపాటు సినీనటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్వో మూర్తిపై కేసులు నమోదుచేశారు. వీటి విచారణలో పోలీసులు ఇప్పటికే ఈ ముగ్గురికి 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేయగా రవిప్రకాశ్, శివాజీ స్పందించలేదు.
బిగిసుకుంటున్న ఉచ్చు..! రవి అస్తమించక తప్పదా..!!
ఈ క్రమంలో ఆదివారం విచారణకు హాజరుకావాలంటూ రెండోసారీ నోటీసులిచ్చినా రవిప్రకాశ్ హాజరుకాలేదు. దీంతో ఈసారి 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చారు. ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులనే కాకుండా సాక్ష్యులకూ 160 సీఆర్పీసీ నోటీసులిస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగ్గ ఆధారాలున్నాయని నిర్ధారించుకున్నాకే 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇస్తారు. అంటే రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాల్ని పోలీసులు సేకరించి ఉంటారనే చర్చ జరుగుతోంది.