లారీ బీభత్సం: తండ్రీకొడుకులతోపాటు ముగ్గురి మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. భారీ లోడ్తో లారీ జనంపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు కూడా ప్రాణాలు విడిచాడు. మియాపూర్ ఠాణా పరిధిలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు, మృతుల బంధువుల వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన చీకట్ల కృష్ణమూర్తి(60), ఆయన కుమారులు చీకట్ల శ్రీనివాస్(32), సురేష్, వీరి బంధువు బెజవాడ ఆది నారాయణ(ఆదిబాబు)(38) మదీనగూడలో జాతీయ రహదారి పక్కన పూల మొక్కల నర్సరీ నిర్వహిస్తున్నారు.
అక్కడే చిన్న గుడిసెలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున వారు నిద్రిస్తున్న సమయంలో కూకట్పల్లి నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళ్తున్న లారీ నర్సరీలోకి దూసుకెళ్లింది. ఆదిబాబు, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి, ఆయన చిన్నకుమారుడు సురేష్ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతిచెందాడు.
పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మితిమీరిన వేగం, నిద్రమత్తులో లారీని నడపడంతో ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతులు
కృష్ణమూర్తి కుమారులు శ్రీనివాస్, సురేష్, నాగబాబు, వారి బంధువు ఆదిబాబు గతంలో వర్షాకాలంలో నగరానికి వచ్చి సైకిల్పై మొక్కలు విక్రయిస్తుండేవారు.
మృతుడు
గ్రామంలో కిరాణా దుకాణం, వ్యవసాయ పనులు చేసుకునే కృష్ణమూర్తి కుమారులు ముగ్గురితోపాటు ఆదిబాబు 20 రోజుల క్రితం మదీనాగూడ వద్ద సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకున్నారు.
మృతుడు
పిల్లలకు తోడుగా ఉండేందుకు కృష్ణమూర్తి వారం క్రితం నగరానికి వచ్చి నర్సరీ వద్దే ఉంటున్నాడు. ప్రమాదంలో తండ్రి, కొడుకులు కృష్ణమూర్తి, శ్రీనివాసు, ఆదిబాబు మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులు స్థానికంగా నర్సరీలు నిర్వహించుకునే కోరుమిల్లి వాసులు పెద్దఎత్తున సంఘటన స్థలానికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.
ముగ్గురి ప్రాణం తీసిన లారీ
వీరితోపాటే నర్సరీలో ఉండే చిన్నకుమారుడు నాగబాబు ఆదివారం రాత్రి పుణేలో మొక్కలు కొనుగొలు చేసేందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
మృత్యువాహనం
మొక్కల వ్యాపారం కోసం 15 రోజుల కిందటే హైదరాబాద్ వచ్చిన ఆదిబాబు, శ్రీనివాస్, కృష్ణమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.