హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు ప్రయాణికులు మృతి
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. గురువారం జెడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా, గోవా నుంచి వచ్చిన నితిన్ షా ఇద్దరూ విమానాశ్రయంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
విమానాశ్రయంలో దిగిన తర్వాత ఒక్కసారిగా ఇద్దరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడే కుప్పకూలడంతో వారిని చికిత్స నిమిత్తం ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు విమానాశ్రయ అధికారులు. చికిత్సపొందుతూ ఇద్దరు ప్రయాణికులు నితిన్ షా, షేక్ సకినా మృతి చెందారు.

కాగా, ఈ ఇద్దరు ప్రయాణికులు కూడా వేర్వేరు విమానాల్లో.. వేర్వేరుగా ప్రాంతాల నుంచి గురువారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగారు. విమానం దిగి.. రన్ వే పైనుంచి ఎయిర్ పోర్టులోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు.
ఆ వెంటనే విమానాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రయాణికులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
విమానం నాలుగు గంటల ఆలస్యం: ప్రయాణికుల గగ్గోలు
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐఏ)గా అధికారికంగా పిలువబడే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం టేకాఫ్ ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. డీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. హైదరాబాద్ నుంచి కొలంబో వెళ్లే విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
ఆలస్యం కారణంగా, చాలా మంది ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏర్పాట్లపై తమ నిరాశను వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 11:45 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరడం గమనార్హం.












Click it and Unblock the Notifications