బాబుకు గ్రేటర్ షాక్: తెరాసలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలలోపే వీరు సైకిల్ దిగి కారు ఎక్కుతారని ప్రచారం సాగుతోంది.
గత కొంతకాలంగా తెరాస నేతలతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని సమాచారం. సోమవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి తాము ఈ నెలాఖరులోగా తెరాసలో చేరుతామని చెప్పారని తెలుస్తోంది. వీరిద్దరు కూడా గ్రేటర్ హైదరాబాదుకు చెందిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీజేపీ-టీడీపీ పొత్తు కారణంగా మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీల నుండి గెలుపొందారు. అందులో ఆయిదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు. టీడీపీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలు ఇప్పటికే తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
ఇప్పుడు గ్రేటర్కు చెందిన మరో ఇద్దరు కారు ఎక్కనున్నారని ప్రచారం సాగుతోంది. ఇది గ్రేటర్ టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాదుకు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడటం గమనార్హం. అయితే, వారు ఎవరనేది తెలియాల్సి ఉంది.