‘సినిమాకొస్తావా! ఫోన్ నెంబర్ ఇవ్వు పాస్ చేయిస్తా’: పరీక్ష రాస్తున్న విద్యార్థినులకు వేధింపులు
ఖమ్మం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచిమార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు ఇటీవలి కాలంలో బాధ్యత మరిచి కీచకుళ్ల ప్రవర్తిస్తున్నారు. గురువే దైవంగా భావించే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
'నీ ఫోన్ నెంబర్ చెప్పు. నాతో సినిమాకొస్తావా..? వస్తే పరీక్ష చూసి రాసుకోనిస్తా. పాస్ చేయించే బాధ్యత కూడా నాదే' అంటూ ఖమ్మంలోని ఓ కళాశాలలో డిగ్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులతో అధ్యాపకులు మాట్లాడిన తీరు ఇది. ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అధ్యాపకుల అసభ్య ప్రవర్తనతో నిశ్చేష్టులైన సదరు విద్యార్థినుల్లో ఒకరు విలపిస్తూ పేపరు ఇచ్చి వెళ్లిపోగా.. మరో విద్యార్థిని వేధింపులు భరించుకుంటూనే.. పరీక్ష రాసినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్షలకు హాజరయ్యేందుకు రోజులాగానే సోమవారం కూడా వెళ్లిన కొందరు విద్యార్థినులు సక్రమంగా పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. ఖమ్మంలోని ఓ డిగ్రీ కళాశాలలో పరీక్షా సమయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఇద్దరు ఇన్విజిలేటర్లు విద్యార్థినుల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించారు.
కళశాలలో ఒక గదిలో ఇన్విజిలేషన్కు వచ్చిన అధ్యాపకుడు, ఆయన పక్క గదిలో ఉన్న మరో ఇన్విజిలేర్ విద్యార్థినులను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. తమకు సహకరిస్తే పరీక్షల్లో చూసి రాసుకునేందుకు అవకాశం కల్పిస్తామని, మధ్యాహ్నం వేళ సినిమాకు రావాలని అలా వస్తే తప్పకుండా పాసయ్యేలా చేస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
అంతేగాక, విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఇవ్వాలని వేధించారు. అసభ్యపదజాలంతో మాట్లాడారు. దీంతో ఓ విద్యార్థిని పరీక్ష ముగింపునకు ఇంకా సమయం ఉన్నా.. పేపరు ఇచ్చేసి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయింది. మరో విద్యార్థిని అక్కడే ఏడ్చుకుంటూ కూర్చుండిపోయింది. ఒక విద్యార్థిని మాత్రం ఫోన్ నెంబరు అడగ్గా తన వద్ద ఫోన్ లేదని సమాధానమిచ్చింది. దీంతో ఆ ఇన్విజిలేటరు తన ఫోన్ నెంబరు ఆమెకు ఇచ్చాడు.
మరో విద్యార్థినికి చూసి రాసుకోమని చెబుతూ మరో విద్యార్థిని సమధాన పత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చి అసభ్య పదజాలంతో మాట్లాడటంతో ఆ విద్యార్థిని పేపరు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పరీక్షా సమయంలో హాలు నుంచి బయటకు రమ్మని సైగలు చేయడం నుంచి మొదలుకుని ఇంటి అడ్రస్ చెప్పే వరకు వదలలేదని ఆ గదిలోని విద్యార్థినులు చెబుతున్నారు.
పరీక్ష సమయంలోనే ఆ అధ్యాపకులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటే ఇక ఏడాది పోడవునా ఎంతమంది విద్యార్థినులను వేధించి ఉంటారోనని ఆయా విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల తీరు విద్యార్థినులను పాఠశాలలు, కళాశాలలకు పంపించాలంటేనే భయంగా ఉందని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.