చెల్లెలి పెళ్లి కోసం యజమాని ఇంట్లో చోరీ(ఫొటోలు)
హైదరాబాద్: చెల్లెలి పెళ్లి చేయడానికి దొంగగా మారాడు ఓ అన్న. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం బంజారాహిల్స్ ఏసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, సిఐలు సామల వెంకట్ రెడ్డి, ముత్తు చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్కు చెందిన అన్నాడి రాంధర్మేందర్ రెడ్డి(28) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోని ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీలో నివసించే బిఏ మెహర్ కుమార్ ఇంట్లో కొంత కాలం క్రితం డ్రైవర్గా చేరాడు.
కాగా, రాంధర్మేందర్ రెడ్డి చెల్లెలికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల కోసం ధర్మేందర్ తన యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నిరుడు మేలో మెహర్ కుమార్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంట్లో నుంచి రూ. 2.60 లక్షల నగదు, బంగారు, వజ్రాభరణాలను చోరీ చేశాడు. చోరీ జరిగిన రోజే మెహర్ కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విచారణ జరిపిన పోలీసులు ధర్మేందర్ చోరీకి పాల్పడ్డట్లు తేల్చారు. సోమవారం నిందితుడ్ని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ. 2.60 లక్షల నగదు, రూ. 5.40 లక్షల విలువైన ఆభరణాలు, వివిధ ఉపకరణాలు, విలువైన మాంట్బ్లాక్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని రిమాండ్కు తరలించారు.
మరో చోరీ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా ఉప్పుకుంట మండలం ఉండి గ్రామానికి చెందిన సుంకరి సురేష్(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవతి అనే మహిళ ఇంట్లో డ్రైవర్గా పని చేస్తూ రూ. 4.50లక్షల విలువైన బంగారు ఆభరణాలను సురేష్ అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేసి, చోరీకి పాల్పడిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ముత్తు, ఎస్ఐ రమేష్లను ఏసిసి అభినందించారు.