‘సెల్ టవర్’ ఎక్కిన ఇద్దరు మహిళలు, పురుగుల మందు తాగేందుకు మరో మహిళ యత్నం
హైదరాబాద్: తమ సమస్యను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా.. పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ఇద్దరు మహిళలు చివరకు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. మరో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను పోలీసులు కాపాడారు. సెల్ టవర్ తొలగించాలంటూ ఈ మహిళలంతా ఈ విధంగా నిరసనలకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నాయకోటివాడకాలనీ శివారులో ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే, ఆ సెల్ టవర్ నిలిపివేయాలని కోరుతూ ఆ మహిళలు పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు.
సెల్ టవర్ ఇక్కడ్నుంచి తొలగించి కిలోమీటర్ దూరంలో ఎక్కడైనా నిర్మించుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదు. దీంతో మహిళలు ప్రాణాలు సైతం లెక్కడ చేయకుండా చివరకు ఆ సెల్ టవరే ఎక్కి నిరసన తెలిపారు.
టవర్ రేడియేషన్ ద్వారా తమ పిల్లల ప్రాణాలకు హాని కలుగుతుందని, ఇక్కడ వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, వారి ఆరోగ్యం ఇప్పటికే బాగోలేదని.. ఈ సెల్ టవర్ కారణం మరింత క్షీణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలు సెల్ టవర్ ఎక్కారన్న సమచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. టవరెక్కిన లక్ష్మి, వరలక్ష్మికి సర్ది చెప్పారు. ఇంతలోనే మరో మహిళ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా.. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు వారిని సముదాయించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శాంతించిన మహిళలు తమ నిరసనలను విరమించుకున్నారు.