ఫేస్బుక్ నుంచి అమ్మాయి ఫోటో డౌన్లోడ్ చేసుకొని, వాట్సాప్లో పరిచయం చేసుకొని..
ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని ఇద్దరు యువకులు డబ్బుల కోసం వేధించారు. ఆమెను బెదిరించి బంగారు గొలుసు లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మలక్పేట పోలీసులు యువకులను అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని ఇద్దరు యువకులు డబ్బుల కోసం వేధించారు. ఆమెను బెదిరించి బంగారు గొలుసు లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మలక్పేట పోలీసులు యువకులను అరెస్టు చేశారు.
నిందితుల్లో ఒకరు ఫేస్బుక్ చూస్తుండగా ఓ అమ్మాయి ఫొటో కనిపించింది. వెంటనే ఆ ఫొటోను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆమె మొబైల్ నెంబర్ను తన మొబైల్లోని వాట్సప్ గ్రూప్లో చేర్చాడు. చాటింగ్ చేస్తూ పరిచయం చేసుకున్నాడు. తర్వాత డౌన్లోడ్ చేసిన ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి వేధించడం ప్రారంభించాడు.
అనంతరం డబ్బులు డిమాండ్ చేశాడు. పరువు పోతుందన్న భయంతో తన మెడలోని బంగారు గొలుసు ఇచ్చింది. అంతటితో వేధింపులు ఆగలేదు.
రూ.50 వేలు ఇవ్వాలని స్నేహితుడితో కలిసి ఆమెను మళ్లీ వేధించడం ప్రారంభించాడు. ఇది భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
నిందితులు వీరిద్దరే
కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన వినయ్ కుమార్ బీటెక్, ప్రవీణ్ (27) ఎంసీఏ పూర్తి చేశారు. వీరు ఫేస్బుక్లో ముసారాంబాగ్ శ్రీపురంకాలనీ నివాసి, ఇంజనీరింగ్ విద్యార్థిని ఫొటోను ఆగస్ట్ ఐదో తేదీన డౌన్లోడ్ చేసుకున్నారు.
వాట్సాప్ ద్వారా పరిచయం
అందులో ఉన్న ఆమె మొబైల్ నెంబర్ను నమోదు చేసుకున్న వినయ్ కుమార్ వాట్స్ప్లో పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో పెట్టి వేధించాడు. ఫేస్బుక్లో పెడతామంటూ బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు.
పరువు పోతుందని భావించి..
పరువు పోతుందని బావించిన యువతి వాళ్లను నగరానికి పిలిపించి తన మెడలో ఉన్న 16గ్రాముల బంగారు గొలుసును ఇచ్చింది. వేధింపులు ఆపాలని కోరింది. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి రూ. 50 వేలు డిమాండ్ చేయగా బాధితురాలు మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో క్రైం ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐ శివశంకర్ రూ. 50వేలు ఇస్తానంటూ యువతి ద్వారా చెప్పించారు.
ప్లాన్ వేసి అరెస్ట్
డబ్బు ఇస్తానని కరీంనగర్లో ఉంటున్న వినయ్ కుమార్, ప్రవీణ్ను హైదరాబాదుకు పలిపించింది. డబ్బు తీసుకోవటానికి వచ్చిన వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.