పుణ్యక్షేత్రం జిల్లాగా అక్కర్లేదు: మోత్కుపల్లికి ఉమా మాధవరెడ్డి ఝలక్
హైదరాబాద్: తమ పార్టీ నల్లగొండ జిల్లా నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఝలక్ ఇచ్చారు. యాదగిరిగుట్టును జిల్లాగా చేయాలనే ఆయన డిమాండ్ను ఆమె వ్యతిరేకించారు. పుణ్య క్షేత్రాలను జిల్లాగా చేయాల్సిన అవసరం లేదని ఆమె మంగళవారం మీడియాతో అన్నారు.
కొంత మంది స్వప్రయోజనాల కోసం వారి ప్రాంతాలను జిల్లాలు చేయాలని పట్టుబడుతున్నారని ఆమె పరోక్షంగా మోత్కుపల్లిని ఉద్దేశించి అన్నారు. భువనగిరిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాం కాలంలో భువనగిరి జిల్లాగా ఉందని ఆమె చెప్పారు.
నల్గొండ జిల్లాలోని యాదగిరి గుట్టను ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్తో తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు యాదగిరిగుట్టలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. గుట్టలోని వైకుంఠ ద్వారం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న మోత్కుపల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు.
యాదగిరిగుట్ట గతంలో మోత్కుపల్లి నర్సింహులు ప్రాతినిధ్యం వహించిన ఆలేరు శాసనసభా నియోజకవర్గంలోకి వస్తుంది. కాగా, భువనగిరి శాసనసభా నియోజకవర్గం నుంచి ఉమా మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. నల్లగొండ జిల్లా టిడిపిలో వీరిద్దరు వైరి వర్గాలుగా కొనసాగుతున్నారు.