ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటీతో ముగిసింది. అయితే, ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ కార్యాలయం నుంచి ఈ ముగ్గురు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ ముగ్గురు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న వ్యక్తులే కావడం గమనార్హం.
కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్.. 1970లో సిద్దిపేట జిల్లా మునిగడపలో దేశపతి గోపాలకృష్ణశర్మ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ నేత కేసీఆర్ నిర్వహించిన వేలాది సభలు, ర్యాలీల్లో దేశపతి పాల్గొన్నారు. తెలంగాణ సాధన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా పనిచేస్తున్నారు.

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనువడు చల్లా వెంకట్రామిరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే చల్లా వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
నవీన్ కుమార్ 1978, మే 15న హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన కుర్మయ్యగారి కొండల్ రావు, తిలోత్తమ దంపతులకు జన్మించారు. నవీన్ కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. మేనమామ సుదర్శన్ రావు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావ సభ నాటి నుంచి టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ నవీన్ పాల్గొన్నారు. 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ మార్చి నెలలో పదవీ కాలం పూర్తికానుంది. నవీన్ సేవలు గుర్తించిన సీఎ కేసీఆర్.. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు .












Click it and Unblock the Notifications