వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటనలో ఉద్రిక్తత .. సీఎం కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేసిన నిరుద్యోగులు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు వరంగల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు వరంగల్ లో పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తొలుత ఏకశిలా పార్క్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ పదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కేసీఆర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటన లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
సీఎం కాన్వాయ్ ని కేయూ జేఏసీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాన్వాయ్ కు అడ్డుగా వెళ్లారు. కెసిఆర్ డౌన్ డౌన్.. ఖబడ్దార్ కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. నూతనంగా నిర్మించిన వరంగల్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి కేసీఆర్ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చిన విద్యార్థులు సీఎం కాన్వాయ్ ని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారు.
గతంలో కేటీఆర్ వరంగల్ వచ్చిన క్రమంలో కూడా విద్యార్థులు ఉద్యోగాల కోసం కేటీఆర్ ను అడ్డుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన తరువాత నుండి రగిలిపోతున్న విద్యార్థులు సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాలను భర్తీ చేయాలని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను, నిన్న రాత్రి నుండి పెద్ద ఎత్తున అరెస్టులు చేసినప్పటికీ, నేడు విద్యార్థులు సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటనలో ఉద్రిక్తత .. సీఎం కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేసిన నిరుద్యోగులు#Kcr #Warangal #Telangana pic.twitter.com/mptoRDjf9Y
— oneindiatelugu (@oneindiatelugu) June 21, 2021