కొత్త మిషన్లొచ్చాయ్: టాయ్లెట్ క్లీన్ చేసిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్లెట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. సరైన ఆలన పాలన ఉండదు వాటికి. సకాలంలో శుభ్రం చేసే సిబ్బందీ ఉండరు. అందుబాటులో ఉన్నా గానీ- వాటిని వినియోగించుకోలేని దుస్థితిని ఎదుర్కొంటుంటారు విద్యార్థులు. ఏపీలో ఈ పరిస్థితిని మార్చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసిందక్కడి జగన్ ప్రభుత్వం.
తెలంగాణలో అలాంటి పాఠశాలలకు కొదవలేదు. వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లు నిర్వహణకు నోచుకోలేని దుస్థితిలో కొనసాగుతున్నాయి. సరైన వసతులు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీనిపై రాజకీయంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష భారతీయ జనత పార్టీ, కాంగ్రెస్- టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనూ నిలదీసిన సందర్భాలు లేకపోలేదు.

ఈ పరిణామాల మధ్య ఈ దుస్థితిని మార్చడానికి స్వయంగా పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్లెట్లను క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా యంత్రాలను కొనుగోలు చేసింది. వాటిని త్వరలో అందుబాటులోకి తీసుకుని రానుంది. తొలి విడతలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఆ యంత్రాలను వినియోగంలోకి తీసుకుని రాబోతోంది. దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ హైప్రెషర్ టాయ్లెట్ క్లీనింగ్ మిషన్లను పంపిణీ చేయనుంది.

ఈ హైప్రెషర్ టాయ్లెట్ క్లీనింగ్ మిషన్లను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జామై ఉస్మానియాలో గల ప్రభుత్వ పాఠశాలలో స్వయంగా తానే ఆ మిషన్ల ద్వారా టాయ్లెట్ను క్లీన్ చేశారు. బయట ఆవరణను శుభ్ర పరిచారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం- ఈ హైప్రెషర్ యంత్రాలను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications