రాజకీయాల కోసం బియ్యం కొనలేం; అలా చేస్తే ప్రజాధనం వృధా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో స్పందించారు. బాయిల్డ్ రైస్ ఎవరూ ఉపయోగించరని, పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదని, అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014 లో 3,400 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం ఖర్చు చేసిందని, గతేడాది 2021లో 26,600 కోట్ల రూపాయల ఖర్చు పెట్టామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హుజురాబాద్ ఎన్నికల తర్వాతే తెరమీదకు బాయిల్డ్ రైస్ అంశం
బాయిల్డ్ రైస్ వేర్ హౌజెస్ లో నిల్వ ఉంటున్నాయని పేర్కొన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రా రైస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత రాజకీయాల కోసం బాయిల్డ్ రైస్ కొనాలన్న అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తన ప్రకటన వల్లగాని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన వల్లగాని ధాన్యం ఉత్పత్తి పెరగదని పేర్కొన్న కిషన్ రెడ్డి, గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

రాజకీయాల కోసం అనవసరపు రాద్ధాంతం
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పొదుపు సంఘాలు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేశాయని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ వద్దంటే రాజకీయాల కోసం అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇతర దేశాలకు నేరుగా ఎగుమతి చేసే అధికారం కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఐదారు సంవత్సరాలుగా బాయిల్డ్ రైస్ మిగిలిపోతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాలకు గోనెసంచి డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుందని పేర్కొన్న కిషన్ రెడ్డి, కేంద్రం ఇచ్చిన డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంట్రెస్ట్ మిగులుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

అలా బియ్యం కొంటే ప్రజాధనం వృధా అవుతుంది
దేశ ప్రజలకు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, మళ్లీ మూడు రూపాయల బియ్యం 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బియ్యం నిల్వలు దేశంలో పేరుకుపోయాయని పేర్కొన్న కిషన్ రెడ్డి రాజకీయాల కోసం బియ్యం కొంటే ప్రజల డబ్బులు వృధా అవుతాయి అంటూ వ్యాఖ్యానించారు. అసలు ఈ ధాన్యం కొనుగోలు పై రగడకు కారణం హుజురాబాద్ ఎన్నికలేనంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈటల రాజేందర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. కెసిఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ ధోరణి నచ్చకనే ఈటెల రాజేందర్ బయటకు వచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాజకీయాల కోసం రైతుల్ని బలి చేస్తున్నారు
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రధాని గడ్డం పైన, బట్టల పైన విమర్శలు చేశారని మండిపడిన కిషన్ రెడ్డి, కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా అన్ని ధరలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్న కిషన్ రెడ్డి ప్రతి దాన్నీ రాజకీయం చేస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీల కోసం బడ్జెట్ పెట్టలేదని, ప్రజల కోసమే బడ్జెట్ పెట్టామని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు లేని సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన కిషన్ రెడ్డి సీఎం కెసిఆర్ కుటుంబ రాజకీయాల కోసం బియ్యం కొనలేమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications